మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 డిశెంబరు 2019 (11:15 IST)

దిశా నిందితుల ఎన్‌కౌంటర్.. సోషల్ మీడియాలో సజ్జనార్‌పై ప్రశంసల జల్లు(Video)

దిశా హత్యాచారం కేసు నిందితుల ఎన్‌కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. దిశాకు న్యాయం జరిగిందని దేశ వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్ పేరు మార్మోగిపోతోంది. సోషల్ మీడియాలో సజ్జనార్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. 
 
ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ బృందానికి సజ్జనార్ నేతృత్వం వహిస్తున్నారు. దాంతో శభాష్ సజ్జనార్, దటీజ్ సజ్జనార్, సాహో సజ్జనార్... అంటూ సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తున్నాయి.
 
గతంలో వరంగల్‌లోనూ ఇలాంటి ఎన్‌కౌంటర్ జరిగింది. అమ్మాయిలపై యాసిడ్ దాడి చేసిన ముగ్గురు నిందితుల్ని కాల్చి చంపేశారు. ఉమ్మడి ఏపీలో వరంగల్ జిల్లాలో స్పప్నిక, ప్రణీతపై యాసిడ్ దాడి జరిగింది.
 
కాలేజీ నుంచి ఇంటికి వస్తున్న స్వప్నిక, ఆమె స్నేహితురాలు ప్రణీతపై శ్రీనివాస్ అనే వ్యక్తి యాసిడ్‌తో దాడి చేశాడు. అతడికి మరో ఇద్దరు సహకరించారు. 2008 డిసెంబరు 10న జరిగింది. ఆ ఘటనలో ముగ్గురు నిందితులనూ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి చంపేశారు. దీని వెనక కూడా సజ్జనారే ఉన్నారు. అప్పుడు వరంగల్ జిల్లా ఎస్పీగా సజ్జనార్ ఉన్నారు.
 
ఇప్పుడు కూడా దిశా హత్య కేసు నిందితులను ఎన్‌కౌంటర్ చేశారు. దిశా హత్య కేసులో మొత్తం నలుగురు నిందితులను షాద్‌నగర్ సమీపంలోని చటాన్ పల్లి దగ్గర ఎన్‌కౌంటర్ చేసి చంపేశారు.