శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 10 జనవరి 2020 (17:50 IST)

రగులుతున్న రాజధాని... అమరావతిలో రైతులపై పోలీసుల దౌర్జన్యం

రాష్ట్ర ప్రభుత్వం దౌర్జన్యం.. పోలీసుల దాష్టీకంతో రాజధాని అమరావతి రగిలిపోతోంది. రాజధాని కోసం పొలాలిచ్చిన రైతాంగం పోలీసుల బూట్ల కింద నలిగిపోతోంది. మహిళల్ని సైతం వదలకుండా పోలీసు యంత్రాంగం లాఠీలను ఝళిపిస్తోంది.

దీంతో బిక్కచచ్చిన రాజధాని నివురుగప్పిన నిప్పులా.. ఉప్ఫున వీచే గాలికోసం ఎదురు చూస్తోంది. ఏపీ రాజధానిగా అమరావతినే ఉంచాలని, మార్చవద్దని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు రోజు రోజుకు ఆందోళనలు తీవ్రతరం చేస్తున్నారు.

అందులో భాగంగా శుక్రవారం మహిళలు పెద్ద ఎత్తున ఉద్దండరాయనిపాలెం శంకుస్థాపనవద్దకు బయలుదేరగా పోలీసులు తుళ్లూరుకు 5 కి.మీ. దూరంలో వారిని అడ్డుకుని నిలిపివేశారు. చాలా మంది మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. మహిళలను పోలీసులు ఎక్కడికక్కడ నిలిపవేశారు. అయితే మహిళలు అమ్మవారికి చెల్లించాల్సిన మొక్కులు నెత్తిపై పెట్టుకుని అలాగే నిలుచున్నారు.

ఈ నేపథ్యంలో ఓ రైతు ఏడుస్తూ పరుగున వచ్చి ‘మా ఆవిడకు గుండెపోటు వచ్చిందట.. బస్సులో ఉందట, పోలీసులు ఎక్కడికి తీసుకువెళ్లారో తెలియదని’ చెబుతూ బోరుమన్నాడు. రాజధాని కోసం భూములిచ్చి. తమకిదేం ఖర్మ అని రైతు కన్నీటిపర్యంతమయ్యాడు. ఆనాడు మూడు రాజధానులని ఎందుకు చెప్పలేదని తలబాదుకున్నాడు.

ఎవరికీ చెప్పకుండా పోలీసులు తన భార్యను తీసుకువెళ్లారని, ఎక్కడకు తీసుకువెళ్లారో తెలియడంలేదని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ నేపథ్యంలో మహిళలు చాలా మంది అలసిపోయి పడిపోవడంతో పోలీసులు 108 అంబులెన్స్‌లు రప్పించారు.

మహిళా రైతులను ఈడ్చుకెళ్లిన పోలీసులు..
ఏపీ రాజధానిగా అమరావతినే ఉంచాలని, మార్చవద్దని డిమాండ్ చేస్తూ రాజధాని రైతులు రోజు రోజుకు ఆందోళనలు తీవ్రతరం చేస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం మహిళలు పెద్ద ఎత్తున ఉద్దండరాయనిపాలెం శంకుస్థాపనవద్దకు బయలుదేరగా పోలీసులు తుళ్లూరుకు 5 కి.మీ. దూరంలో వారిని అడ్డుకుని నిలిపివేశారు.

అక్కడే అందోళన చేస్తున్న మహిళా రైతులను పోలీసులు ఈడ్చుకుంటూ బస్సులో ఎక్కించారు. దీంతో బస్సు ఇక్కడి నుంచి వెళ్లడానికి వీలు లేదని పేర్కొంటూ పెద్ద ఎత్తున మహిళలు బస్సుముందు కూర్చొని నిరసన తెలిపారు. బస్సును ముందుకు కదలనీయలేదు. బస్సు చుట్టూ గ్రామస్తులు కూర్చున్నారు. తాము అమ్మవారి గుడికి వెళుతుండగా ఎందుకు అడ్డగిస్తున్నారని రైతులు పోలీసులను ప్రశ్నించారు.

తమను అమ్మవారి గుడికి వెళ్లనివ్వాలంటూ అక్కడే రోడ్డుపై కూర్చొని నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికే పోలీసులు రైతులను ఐదుసార్లు అడ్డగించారు. అయినా పరిస్థితిలో ఎటువంటి మార్పు రాలేదు. కొంతమంది రైతులు పొలాలమీదుగా నడుచుకుంటూ వెళ్లారు.

మరికొంతమంది రోడ్డు మధ్యనే ఆగిపోవడంతో పోలీసులు అరెస్టు చేసే ప్రయత్నం చేయడంతో బస్సుకు అడ్డంగా కూర్చొని నిరసన తెలుపుతున్నారు. ఏం జరిగిగా ఇక్కడినుంచి వెళ్లేదిలేదని రైతులు తేల్చి చెప్పారు.

లోకేశ్, కళా వెంకట్రావ్ అరెస్ట్
ఏపీ మాజీ మంత్రులు, టీడీపీ నేతలు నారా లోకేశ్, కళా వెంకట్రావ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కాజా టోల్ ప్లాజా దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాజధాని ప్రాంతంలో పర్యటనకు అనుమతి లేదని పోలీసులు లోకేశ్, కళా వెంకట్రావులను అడ్డుకున్నారు.

దీంతో లోకేశ్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. తాను చట్టాన్ని ఉల్లంఘించలేదని, ఒంగోలు పర్యటనకు వెళ్లి వస్తున్నానన్నారు. నారా లోకేష్,కళా వెంకట్రావుని ఉండవల్లి నివాసానికి తరలించి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

రైతులతో పవన్ భేటీ
రాజధాని రైతులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. జనసేన చీఫ్ ముందు గుంటూరు జిల్లా ధర్మవరం రైతులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ వృద్ధురాలిని వేదికపైకి ఆహ్వానించగా ఆమె వచ్చి పవన్‌ను గట్టిగా పట్టుకుంది.

తీవ్ర ఉద్వేగానికి గురైన ఆమె.. కొద్దిసేపు అలాగే ఉండిపోయింది. దీంతో పవన్ కూడా ఒక్కసారిగా చలించిపోయారు. ‘‘చిన్నప్పుడు మా అమ్మమ్మతో ఉన్నట్టుంది. అమ్మమ్మ, మేనత్తలను ఇలాగే పట్టుకునేవాడిని’’ అని పవన్ వ్యాఖ్యానించారు.

పేరేంటమ్మా అని.. ఆమెను పవన్ అడగగా.. తన పేరు కొండవీటి రాజమ్మని.. పల్నాడు నుంచి వచ్చానని తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తన మనవడు ప్రవీణ్ కుమార్ గురించి చెప్పారు. ‘‘వాడి పాట మీదే .. ఆట మీదే. మిమ్మల్ని చూపించమని.. వాడితో రోజూ గొడవే. మన నాయకుడిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది.

ఎక్కడున్నా సరే.. దేవుడిగా అనుకోవలసిందే. ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్లు ఇష్టమొచ్చినట్టు చేస్తున్నారు. మీరేం చేస్తారో నాకు తెలియదు. మేము నిమిత్తమాత్రులం’’ అని తెలిపారు.
 
బందరు రోడ్డుపై బైఠాయించిన మహిళలు
విజయవాడ పరిధిలోని బందరు రోడ్డుపై మహిళలు బైఠాయించారు. రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ మహిళలు రోడ్డుపైకి వచ్చారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ అమరావతిగా రాజధానినే ఒప్పుకొని ఇప్పుడు విశాఖకు తరలిస్తామంటే కుదరదన్నారు.
 
పోలీసులు ఎవరిపైనా దాడి చేయలేదు: ఎస్పీ
ఏపీ రాజధాని ప్రాంతం తుళ్లూరులో మహిళలపై పోలీసులు దాడి చేశారని వస్తున్న ఆరోపణలపై ఎస్పీ విజయరావు స్పందించారు. ‘‘144 సెక్షన్‌, 30 పోలీసు యాక్ట్‌" అమల్లో ఉందని ముందుగానే ప్రకటించాం. అయినా చట్టవిరుద్ధంగా ఒకేసారి గుంపుగా రావడం వల్లే వారిని అడ్డుకున్నాం. 
 
పోలీసులు ఎవరిపైనా దాడి చేయలేదు. నకిలీ వీడియోలు వైరల్‌ చేస్తున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. రాజధానిలో పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయి అని ఎస్పీ విజయరావు తెలిపారు.