ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (13:28 IST)

జయరామ్‌కు అమ్మాయిల పిచ్చి... ఆ వీక్నెస్‌తోనే చావుదెబ్బకొట్టా : రాకేష్ రెడ్డి

ఇటీవల తన చేతిలో హత్యకు గురైన కోస్టల్ బ్యాంకు ఛైర్మన్, ఎన్నారై జయరామ్‌కు అమ్మాయిల పిచ్చి ఎక్కువని, ఆ వీక్నెస్‌తోనే ఆయన్ను దెబ్బకొట్టినట్టు ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాకేష్ రెడ్డి వెల్లడించారు. 
 
ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న రాకేష్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. అతను పోలీసులకు ఇచ్చిన విషయంలో అనేక సంచలన విషయాలు వెల్లడించాడు. ముఖ్యంగా, జయరామ్‌తో తనకు పరిచయం ఎలా ఏర్పడిందన్న విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్పాడు. 
 
జయరామ్ మేనకోడలు శిఖా చౌదరిని తనకు పరిచయం చేసింది ఆయనేనని చెప్పాడు. ఆ తర్వాత తమ మధ్య బంధం మరింత బలపడిందని తెలిపాడు. అదేసమయంలో తనను పెళ్లి చేసుకుంటానని శిఖా చెప్పడంతో ఆమెకు చాలా డబ్బు ఖర్చు పెట్టినట్టు తెలిపాడు. 
 
అయితే, శిఖా చౌదరి తనతో సన్నిహితంగా ఉండటాన్ని చూసిన జయరామ్ సహించుకోలేక పోయాడనీ, పైగా, శిఖా వదిలివేయాల్సిందిగా కోరాడని తెలిపాడు. ఇందుకోసం తనకు ఇవ్వాల్సిన రూ.4.5 కోట్ల రుణంతో పాటు శిఖా ఖర్చు పెట్టిన రూ.కోటి డబ్బులు కూడా తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడని కానీ, ఇప్పటివరకు ఒక్క పైసా చెల్లించలేదని రాకేష్ రెడ్డి వివరించాడు. 
 
జయరామ్‌కు అమ్మాయిల పిచ్చి ఎక్కువని, అందుకే తాను ఓ కొత్త నంబరు తీసుకుని దాని వాట్సాప్‌ ప్రొపైల్ పిక్‌లో అమ్మాయి ఫోటో పెట్టి.. పదేపదే చాట్ చేశానని చెప్పాడు. ఆ తర్వాత ఎంజాయ్ చేద్దామని ఆ అమ్మాయే పిలిచినట్టుగా తాను మెసేజ్ పెట్టానని, దీన్ని నమ్మిన జయరామ్.. తన ఇంటికి రావడంతో అతన్ని బంధించినట్టు చెప్పాడు. 
 
ఆ తర్వాత గత నెల 31వ తేదీన తమ మధ్య చిన్నపాటి గొడవ జరగడంతో అతనిపై పిడిగుద్దులు గుద్దానని, ఆయన హార్ట్ పేషెంట్ కావడంతో చిన్నపాటి దెబ్బలకే కుప్పకూలిపోయాడని చెప్పాడు. అపుడు ఏం చేయాలో తెలియక... మృతదేహాన్ని తన కారు డ్రైవర్ సాయంతో నందిగామకు తరలించి, నందిగామ జాతీయ రహదారి సమీపంలో వదిలివేసినట్టు చెప్పాడు. అక్కడ నుంచి తాను బసులో హైదరాబాద్‌కు వచ్చినట్టు రాకేష్ రెడ్డి తెలిపాడు.