శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 4 నవంబరు 2017 (12:41 IST)

జగన్‌కు షాక్.. సైకిలెక్కిన రంపచోడవరం వైకాపా ఎమ్మెల్యే

ఈనెల ఆరో తేదీ నుంచి పాదయాత్ర చేపట్టనున్న వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఈస్ట్ గోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి శనివారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక

ఈనెల ఆరో తేదీ నుంచి పాదయాత్ర చేపట్టనున్న వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఈస్ట్ గోదావరి జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి శనివారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆమెకు స్వాగతం పలికిన చంద్రబాబు, పచ్చకండువాను కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. 
 
ఈ సందర్భంగా రాజేశ్వరి మాట్లాడుతూ, నియోజకవర్గం అభివృద్ధి కోసమే తాను టీడీపీలో చేరినట్టు తెలిపారు. చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, ఆయన అడుగుజాడల్లో ఇకపై నడుస్తానని అన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్, అసెంబ్లీకి వెళ్లకూడదని తీసుకున్న నిర్ణయం తనతో పాటు చాలా మంది ఎమ్మెల్యేలకు నచ్చలేదన్నారు. 
 
అసెంబ్లీని బహిష్కరించడం సరికాదని వ్యాఖ్యానించిన ఆమె, తన నియోజకవర్గం ఎన్నో సమస్యల్లో ఉందని, వాటిని అసెంబ్లీలో ప్రస్తావించి, పరిష్కార మార్గాలు వెతుకుతానని తెలిపారు. తాను అసెంబ్లీకి వెళతానని చెప్పారు. తన నియోజకవర్గంలో అధికంగా ఉన్న ఎస్టీలు తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, దురదృష్టవశాత్తూ జగన్, తన నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టకపోగా, సభలో తనకు ప్రశ్నించే అవకాశం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. 
 
కాగా, తూర్పుగోదావరి జిల్లాలో వైకాపా ఐదు స్థానాలను గెలుచుకోగా, ఇప్పటికే జ్యోతుల నెహ్రూ, పరుపుల సుబ్బారావు టీడీపీలో చేరిపోయారు. తాజాగా రాజేశ్వరి కూడా వారి వెంటే నడవడంతో, వైసీపీ బలం రెండుకు తగ్గింది. ఆమెతో సహా ఇప్పటివరకూ 22 మంది టీడీపీలో చేరగా, మరో రెండు రోజుల్లో ఇంకో నలుగురైదుగురిని టీడీపీలోకి తీసుకొచ్చి, జగన్‌ను నైతికంగా దెబ్బతీయాలన్నది టీడీపీ ఆలోచనగా తెలుస్తోంది.