గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 19 అక్టోబరు 2019 (19:32 IST)

అవుట్‌ సోర్సింగ్‌ కార్మిక, ఉద్యోగ నియామకాల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌

అవుట్‌ సోర్సింగ్‌ కార్మిక, ఉద్యోగ నియామకాల కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారని వైయస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు పీ. గౌతం రెడ్డి తెలిపారు. విజయవాడ తాడేపల్లి వైయస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 
 
కంపెనీ చట్టం సెక్షన్‌–8 కింద  ప్రత్యేక కార్పొరేషన్‌  ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం పట్ల గౌతంరెడ్డి  హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేక కార్పొరేషన్‌ కోసం ఇవాళ జీవో 126ను జారీ చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి జనరంజక పాలనపై కార్మికులతో పాటు వివధ వర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. 
 
చంద్రబాబు తన హయాంలో కార్మికుల సంక్షేమానికి ఏ మాత్రం  పాటు పడలేదని గౌతంరెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్రంలో అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు, ఉద్యోగులు మూడు లక్షల మంది ఉండగా చంద్రబాబు వారి సంఖ్య కేవలం 25 వేలు మాత్రమేనని గతంలో తప్పుడు ప్రకటన చేశారని విమర్శించారు. 
 
బాబొస్తే జాబు వస్తుందని నమ్మబలికే ప్రయత్నం చేసిన చంద్రబాబు చివరకు నిరుద్యోగులను మోసం చేశారని, తన కుమారుడు నారా లోకేశ్‌కు మాత్రమే మంత్రి పదవి కట్టబెట్టి ప్రజాగ్రహానికి గురి అయ్యారని గుర్తు చేశారు. 
 
ప్రజాసంకల్ప యాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి క్రమంగా అమలు పరుస్తూ ప్రజాభిమానాన్ని చూరగొంటున్నారని  గౌతంరెడ్డి ప్రశంసించారు.  అనేక సంక్షేమ పథకాలను అమలు  చేయడం ద్వారా  మన్ననలను పొందుతున్నారని  ప్రస్తుతించారు. 
 
ప్రభుత్వ ఆసుపత్రులలో పారిశుద్ధ్య కార్మికుల వేతనాలను రూ 16 వేలకు పెంచుతూ మరో జీవో ఇచ్చారు.  మునిసిపాలిటీలలో పని చేసే కార్మికుల జీతాలను రూ 18 వేలకు పెంచారని  గౌతంరెడ్డి తెలిపారు. 
 
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు. ఉద్యోగుల  సంక్షేమం కోసం కంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకాన్ని రద్దు చేశారు. చేనేత కార్మికులకు ఏటా రూ 24 వేల సాయాన్ని అందించనున్నారు. 
 
అదే విధంగా ఆటోలను నడిçపే కార్మికులకు ఈఏడాది రూ 10 వేల సాయాన్ని అందించారు. అంగన్‌వాడీలు, హెల్త్‌  వర్కర్లు, డ్వాక్రా మహిళా కార్మికుల సంక్షేమానికి  ప్రభుత్వం  పాటు పడుతోందని గౌతంరెడ్డి అన్నారు.  
 
పరిశ్రమలలో  75 శాతం ఉద్యోగాలు స్థానికులకే నని  విధాన నిర్ణయాన్ని  ముఖ్యమంత్రి తీసుకున్న వైయస్‌ జగన్‌ కార్మిక పక్షపాతి అన్న పేరు తెచ్చుకున్నారు. 
 
చంద్రబాబు మోస పూరిత విధానాలకు జడిసి వైద్య విభాగంలోని కార్మిక సంఘం వైయస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ వైపు వచ్చిందని గౌతంరెడ్డి ప్రకటించారు. కార్మికులు, ఉద్యోగులకు మేలు చేస్తోన్న ముఖ్యమంత్రికి ప్రతి ఒక్కరూ కృతజ్ఞతగా ఉండాలని, ఆయన చిత్ర పటానికి పాలాభిషేకం చేయాలని గౌతంరెడ్డి విజ్ఞప్తి చేశారు. 
 
మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రభుత్వంలోని ఉద్యోగ ఖాళీలను గుర్తించి ప్రతి ఏటా జనవరి 1న నోటిఫికేషన్ జారీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గౌతంరెడ్డి తెలిపారు.