శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Modified: శనివారం, 23 మార్చి 2019 (15:16 IST)

మొక్కజొన్న చేనులో కన్నకూతురిపై అత్యాచారం... గాజు పెంకులు గుచ్చుకున్నాయని...

కామాంధుల వికృతాలు రోజురోజుకీ పేట్రేగిపోతున్నాయి. చివరికి కన్నకుమార్తెలను సైతం వదలడంలేదు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో మూడో తరగతి చదువుకుంటున్న ఏడేళ్ల కుమార్తెపై కన్నతండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
వివరాలను చూస్తే... ఐదు రోజుల క్రిత కుమార్తె తల్లి కూలీ పనికి వెళ్లింది. ఆమె భర్త తనకు ఆరోగ్యం బాగాలేదని ఇంట్లోనే వుండిపోయాడు. వేసవి సెలవులు కావడంతో వారి ఏడేళ్ల కుమార్తె కూడా ఇంట్లోనే వుంది. దీనితో ఆమెపై కన్నేశాడు కన్నతండ్రి. ఆ బాలికను పొలం వెళ్దాం రమ్మనిచెప్పి మోటారు సైకిలుపై తీసుకుని వెళ్లాడు. ఊరి శివార్లలో వున్న మొక్కజొన్న తోటలోకి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. దీనితో బాలికకు తీవ్ర రక్తస్రావమైంది. 
 
ఆ కామాంధుడు బాలికతో తను కిందపడ్డాననీ, గాజు పెంకులు గుచ్చుకోవడం వల్ల ఇలా అయిందని చెప్పాలన్నాడు. అలా చెప్పకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు. సాయంత్రం తల్లి ఇంటికి వచ్చాక కుమార్తె పరిస్థితి చూసి ఆందోళనకు గురైంది. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యుడు పరీక్షించి ఎందుకలా అయ్యిందని అడిగితే గాజు పెంకులు గుచ్చుకున్నాయని చెప్పింది. 
 
అప్పటికి ప్రథమ చికిత్స చేసి పంపేశాడు వైద్యుడు. కానీ ఆ తర్వాత కూడా బాలిక ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండటంతో తల్లి ఆమెను నిలదీసింది. దానితో అసలు విషయం తల్లికి చెప్పేసింది ఆ బాలిక. కన్న కుమార్తెపైనే అత్యాచానికి పాల్పడ్డ భర్తను వెంటనే అరెస్టే చేసి కఠినంగా శిక్షించాలని ఫిర్యాదు చేసింది ఆమె. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.