శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 26 జూన్ 2018 (15:38 IST)

మిస్టర్ పవన్... కడప పౌరుషాన్ని రెచ్చగొట్టద్దు : సీఎం రమేష్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ గట్టివార్నింగ్ ఇచ్చారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం తాను చేపట్టిన ఉక్కు దీక్షను హేళన చేసేలా పవన్ మాట్లాడటాన్ని ఆయన తప్పుబట్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ గట్టివార్నింగ్ ఇచ్చారు. కడప స్టీల్ ప్లాంట్ కోసం తాను చేపట్టిన ఉక్కు దీక్షను హేళన చేసేలా పవన్ మాట్లాడటాన్ని ఆయన తప్పుబట్టారు. టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా మాట్లాడొద్దంటూ, దమ్మూధైర్యం ఉంటే కడపకు వచ్చి మాట్లాడాలంటూ ఆయన సవాల్ విసిరారు.
 
ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిలు గత ఎనిమిది రోజులుగా కడపలో ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న విషయం తెల్సిందే. ఈ దీక్షను కించపరిచేలా పవన్ కామెంట్స్ చేశారు. దీనిపై సీఎం రమేష్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, 'కడప పౌరుషాన్ని రెచ్చగొట్టద్దు. దీక్షను నీరుగార్చేలా వ్యవహరిస్తున్నావు. జాగ్రత్త. కమీషన్లు తీసుకున్నట్లు నిరూపించు. నేను ఎంపీ పదవికి రాజీనామా చేస్తా. లేదంటే మీరు ఏం చేస్తారో ప్రకటించండి. దీక్ష పవిత్రతను వక్రీకరిస్తున్న మీ గురించి మాట్లాడాలంటే ఎంతో ఉంది. ఇదేమీ సినిమా కాదు. ప్రజారాజ్యం పార్టీ అంతకన్నా కాదు. నీవు చేసిన ఆరోపణలపై మనమిద్దరమే మాట్లాడుకుందాం. కాణిపాకం ఆలయానికి వెళ్లి ప్రమాణం చేస్తావా? దీక్ష అంటే ఏమనుకుంటున్నావు? అసలు నీకు రాజకీయాలు తెలుసా? దీక్షా శిబిరానికి వచ్చి మాట్లాడు. అసలు జిందాల్‌లు నీకు తెలుసా? ఉక్కు దీక్ష భావితరాల కోసం చేస్తున్న దీక్ష అని తెలుసుకో' అంటూ పవన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. 
 
ఆ తర్వాత ఈ దీక్షా శిబిరాన్ని సందర్శించిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఇనుప ఖనిజాన్ని దోచుకుని కోట్లు గడించిన గాలి జనార్దన్‌ రెడ్డిని రంగంలోకి దింపేందుకు మోడీపావులు కదుపుతున్నారని ఆరోపించారు. కడపను అడ్డంపెట్టుకుని ఎదిగిన జగన్‌ ఉక్కు గురించి ఒక్క మాటకూడా మాట్లాడకపోవటం దారుణమన్నారు. వేలాది లోడుల ఐరన్‌ ఓర్‌ను అక్రమంగా చైనాకు రవాణా చేసి వేల కోట్లు స్వాహా చేసిన గాలి తాజాగా రంగంపైకి వచ్చి ఫ్యాక్టరీ పెడతాననటం విడ్డూరంగా ఉందన్నారు. ఉక్కు పరిశ్రమ రాకుండా తెలుగుదేశం పార్టీయే అడ్డుకుంటుందంటూ పవన్‌ చేసిన ప్రకటన ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమన్నారు.