బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 28 డిశెంబరు 2019 (21:35 IST)

ఇకపై అభివృద్ధిపైనే ప్రభుత్వ ప్రధాన దృష్టి: మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

కొత్త సంవత్సరంలో సరికొత్త ఇండస్ట్రియల్ పాలసీ తీసుకువస్తున్నట్లు పరిశ్రమలు, ఐ.టీ, జౌళి శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. సంక్షేమం ప్రతి ఇంటికి చేరడంలో నిమగ్నమైన ప్రభుత్వం ..ఇకపై అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెట్టనుందని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు.

విజయవాడలోని ఏపీటీఎస్ కార్యాలయంలో శనివారం పరిశ్రమలు, ఐ.టీ, జౌళి శాఖలపై సంయుక్తంగా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రాధాన్యాతలకు అనుగుణంగా పని చేసేలా ఐ.టీ, పరిశ్రమలు, జౌళి శాఖలు సిద్ధంగా ఉండాలని మంత్రి తెలిపారు. తన శాఖలలో ఏ ఫైళ్లు పెండింగ్ ఉండకుండా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఎక్కడా జాప్యం జరగకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు.

ఒకవేళ శాఖలలో సాంకేతికపరమైన ఇబ్బందులుంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ కార్యాలయంలోని ఏపీసీఎస్ఓసీ పనితీరును మంత్రి పరిశీలించారు. సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ల పనితీరును ఆసక్తిగా తెలుసుకున్నారు.
 
కొత్త సంవత్సరంలో సరికొత్త ఇండస్ట్రియల్ పాలసీ : గౌతమ్ రెడ్డి
కొత్త ఏడాదికి కొత్త పారిశ్రామిక విధానం అందుబాటులోకి తేవాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవను ఆదేశించారు. లోగో, బ్రాండింగ్ లపై మంత్రి చర్చించారు. ఎలక్ట్రానిక్ వెహికిల్స్ పాలసీకి బదులుగా ఆల్టర్ నేటివ్ టెక్నాలజీ పాలసీని సిద్ధం చేస్తున్నట్లు రజత్ భార్గవ మంత్రికి వివరించారు. 5 ట్రిలియన్ల  భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ వాటా గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రత్యేకించి విశాఖ కేంద్రంగా వ్యాపారం, ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి పెట్టలాని పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యంతో మంత్రి అన్నారు.

ఏపీఐఐసీ ల్యాండ్ బ్యాంక్ ను పూర్తిగా ఆన్ లైన్ చేయాలన్నారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. పెట్టుబడిదారులు స్వయంగా ఎక్కడ ఎంత భూమి కావాలో ఎంచుకునే స్థాయిలో ఏపీఐఐసీ ల్యాండ్ బ్యాంక్ డిజిటైలేజేషన్ జరగాలన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూ కేటాయింపులు సత్వరమే పూర్తయ్యేలా చూడాలన్నారు. ఏ విధమైన ఇబ్బందులొచ్చినా ఎప్పుడైనా తనను సంప్రదించవచ్చని మంత్రి స్పష్టం చేశారు.
 
సచివాలయాల ప్రారంభం నేపథ్యంలో ఐటీ శాఖ సంసిద్ధంగా ఉండాలి : మంత్రి గౌతమ్ రెడ్డి
 
ప్రజలకు పారదర్శక పాలన అందించాలన్న ముఖ్యమంత్రి సంకల్పాన్ని నెరవేర్చడంలో  ఐ.టీ శాఖదే కీలక భూమిక అని మంత్రి మేకపాటి అన్నారు. త్వరలోనే గ్రామ సచివాలయాల ద్వారా పాలన ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐ.టీ శాఖ సిద్ధంగా ఉండాలన్నారు మంత్రి గౌతమ్ రెడ్డి. సచివాలయాల పాలనకు అత్యంత కీలకమైన సాంకేతికపరమైన వసతుల కల్పనలో ఐ.టీ శాఖ సంసిద్ధతపై మంత్రి ..ఐ.టీ శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ ను అడిగి తెలుసుకున్నారు. విశాఖను ఐ.టీ హబ్ గా మార్చే విధంగా వేసే ప్రతి అడుగు ముందుకు వేయాలన్నారు.
 
వారానికోసారి శాఖాధిపతులతో రివ్యూ మీటింగ్, టెలికాన్ఫరెన్స్
ఇకపై ప్రతి వారం శాఖాధిపతులతో తాను సమీక్ష నిర్వహించదలచుకున్నట్లు మంత్రి మేకపాటి అధికారులకు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో అభివృద్ధిపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టిపెట్టనున్న నేపథ్యంలో శాఖాధిపతులు , అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైతే టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తానన్నారు. సమీక్షకు ముందే చర్చించిన విషయాలు, పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని మంత్రి ఆదేశించారు.

సమీక్షలకు సంబంధిత శాఖల అధికారులు తప్పక హాజరవ్వాలన్నారు. నిజాయతీగా పనిచేయడం మాత్రమే తనకు తెలుసని, కఠినంగా వ్యవహరించడం తన శైలి కాదని మంత్రి అన్నారు. కానీ, శ్రుతిమించితే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడనని మంత్రి సునిశితంగా హెచ్చరించారు. ఒకవేళ శాఖలలో సాంకేతికపరేమైన ఇబ్బందులుంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

గతంలో ముఖ్యమంత్రి ప్రకటించిన చెరకు రైతుల బకాయిల చెల్లింపు అంశంపై ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ సుగర్స్ కార్యదర్శి కాంతిలాల్ దండేతో మంత్రి గౌతమ్ రెడ్డి ఆరా తీశారు. గ్రామీణ మహిళలు, కళాకారుల హస్తకళలను ప్రోత్సహించే వీలుగా క్లస్టర్లు ఏర్పాటు చేయాలని మంత్రి మేకపాటి అభిప్రాయపడ్డారు.