శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (21:43 IST)

విశాఖ-చెన్నై కారిడార్... 2019 మార్చికి మొదటి విడత...

అమరావతి: విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ (వీసీఐసీ) పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మొదటి ఫేజ్ కింద చేపట్టనున్న పనులను 2019 మార్చిలోపు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నిర్ధేశించిన గడువు

అమరావతి: విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ (వీసీఐసీ) పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మొదటి ఫేజ్ కింద చేపట్టనున్న పనులను 2019 మార్చిలోపు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నిర్ధేశించిన గడువుకు ముందే పనులు పూర్తి చేసిన వారికి కొంత ఇన్సెంటివ్ ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ స్టీరింగ్ కమిటీ సమావేశం మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. 
 
ఈ సందర్భంగా కారిడార్ పనులు జరుగుతున్న తీరును ఆయన సమీక్షించారు. రూ. 5,500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ కారిడార్ పనుల్లో మొదటి ఫేజ్ కింద ఇప్పటికే రూ. 2,200 కోట్లు విలువైన పనులకు సంబంధించిన టెండర్లను పిలిచినట్లు చెప్పారు. ఈ ఏడాది డిసెంబరుకు మొదటి ఫేజ్ పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. 
 
ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) ఆర్థిక సహాయంతో చేపట్టిన ఈ కారిడార్ పనుల్లో జాప్యం నివారించడానికి ఏడీబీ అధికారులతో ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహించాలని అన్నారు. అలాగే, రెండో ఫేజ్ లో చేపట్టాల్సిన పనులను కూడా ఇప్పటి నుంచి గుర్తించాలని అన్నారు. ఏకకాలంలో ఈ ప్రక్రియ కొనసాగాలని చెప్పారు. రాష్ట్ర రాజధాని అమరావతి, విజయవాడ భవిష్యత్ లో కీలకమైన ప్రాంతంగా అభివృద్ధి చెందనున్న నేపధ్యంలో ఈ కారిడార్ కింద ఈ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టేలా ప్రణాళికలు తయారు చేయాలని చెప్పారు. 
 
ఈ ప్రాంతాల్లో ఏయే పనులను చేపట్టడానికి అవకాశం ఉందో వెంటనే గుర్తించాలని కోరారు. మొదట ఫేజ్ లో ఏపీఐఐసీ రూ. 391 కోట్లు, ఏపీఆర్డీసీ రూ.391 కోట్లు, ఏపీ ట్రాన్స్ కో రూ.637 కోట్లు, గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ రూ.381 కోట్లుతో వివిధ పనులను చేపట్టినట్లు అధికారులు చెప్పారు. ఇవికాకుండా మరో రూ. 400 కోట్లుకు సంబంధించిన పనులను కూడా చేపట్టడానికి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ రూ. 381 కోట్లతో చేపట్టిన పనుల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ కూడా ఉండటంపై సీఎస్ అధికారులను ప్రశంసించారు. 
 
ప్రతి ఏటా గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ విద్యుత్ బిల్లులు కింద రూ. 85 కోట్ల వరకు వ్యయం చేస్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ సీఎస్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపధ్యంలో పారిశ్రామిక కారిడార్ పనుల్లో భాగంగా సోలార్ ప్లాంటును కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.