గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 16 జులై 2019 (16:37 IST)

ఆకారంలో పెరిగాడు.. బుర్ర మాత్రం పెరగలేదు : వైఎస్. జగన్

టీడీపీ ఎమ్మెల్యే, అసెంబ్లీ ఉపనేత కె.అచ్చెన్నాయుడుపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిడ్డారు. ఆకారం(సైజు)లో మాత్రం పెరిగాడనీ, బుర్ర పెరగలేదన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా, అచ్చెన్నాయుడు చేసిన ప్రసంగానికి జగన్ మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 
 
ముఖ్యంగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును విలన్‌గా పేర్కొనడాన్ని టీడీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అపుడు జగన్ కల్పించుకుని అచ్చెన్నాయుడుపై మండిపడ్డారు. 
 
'అచ్చెన్నాయుడు మనిషేమో ఈ సైజ్‌లో పెరిగాడు. బుర్ర మాత్రం అరికాలులో కూడా ఉండటం లేదు. బుర్ర ఎందుకు పెరగలేదో ఆయనే ప్రశ్నించుకోవాలి' అంటూ విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలతో టీడీపీ సభ్యులు మరింత మండిపడ్డారు. 
 
అంతకుముందు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రతిపక్షంపై విమర్శలకే సభా సమయాన్నంతా దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. అర్థంలేని ఆరోపణలతో సమయాన్ని వృథా చేస్తున్నారని అన్నారు. విచారణల పేరుతో కాలం గడిపేయాలని జగన్ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 
 
అవినీతి ఆరోపణలతో పోలవరం పనులను కూడా దెబ్బతీస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో పోలవరం పనులు 66 శాతం పూర్తయ్యాయని... కేంద్రం నుంచి నిధులను తెచ్చుకోవడం చేతకాక... టీడీపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
 
రాష్ట్రంలో అధికార మార్పిడి చోటుచేసుకోవడంతో అన్ని ప్రాజెక్టులు ఆగిపోయాయన్నారు. విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన పీపీఏలపై బురద చల్లాలనుకున్న వైసీపీ ప్రభుత్వం చివరకు అభాసుపాలయిందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వలేదని జగన్ అన్నారని... చివరకు ఆధారాలను బయటపెట్టేసరికి ప్లేటు ఫిరాయించారని ఎద్దేవా చేశారు.