శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Updated : శనివారం, 25 మే 2019 (15:01 IST)

ప్రక్షాళన మామూలుగా ఉండదు.. దేవుడు స్క్రిప్టు బాగా రాశాడు : వైఎస్. జగన్

వైకాపా సీఎల్పీ నేతగా వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన తన పార్టీ  తరపున ఎన్నికైన కొత్త ఎమ్మెల్యేలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇందులో ఆయన చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే... 
 
గత ఐదేళ్లలో ప్రజలకు ఏ కష్టమొచ్చినా అండగా నిలిచింది వైసీపీ - ప్రజల విశ్వాసాన్ని చూరగొని అధికారంలోకి వచ్చాం. 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలను స్వీప్ చేశాం. అన్యాయం చేస్తే దేవుడు మొట్టికాయలు వేస్తాడనడానికి చంద్రబాబే నిదర్శనం. 50 శాతం కూడా వైసీపీకే పడింది. ఈ విజయం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. మన పార్టీ నుంచి అన్యాయంగా చంద్రబాబు కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలు 23, ఎంపీలు ముగ్గురు. ఇప్పుడు టీడీపీకి మిగిలింది, చంద్రబాబుకు వచ్చిన ఎమ్మెల్యేల సంఖ్య కూడా 23. ముగ్గురు ఎంపీలు. దేవుడు చాలా గొప్పగా ఈ స్క్రిప్ట్ రాశాడు.
 
మన టార్గెట్ 2024 - 2024లో ఇంతకన్నా ఎక్కువ సీట్లతో గెలవాలి. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. పెర్ఫార్మెన్స్ చూసి ప్రజలు 2024లో మనకు ఓటెయ్యాలి. రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ ఎవరూ చూడనివిధంగా ప్రక్షాళన చేస్తా. మామూలుగా ఉండదు ఆ ప్రక్షాళన. దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూసేవిధంగా ప్రక్షాళన చేస్తా. ఆ ప్రక్షాళనకు మీ అందరి సహాయసహకారాలు కావాలి. అందించాలి. 
 
మొదటి ఆరు నెలలు తిరిగేసరికి జగన్ మంచి ముఖ్యమంత్రి అన్పించుకునేలా పాలన అందిస్తా. త్వరలోనే పంచాయతీ ఎన్నికలు ఉంటాయ్, వాటిని కూడా క్లీన్‌స్వీప్ చేయాలి. ఈ విజయానికి కారణం నాతోపాటు మీ అందరూ, ప్రజలు మనకు గొప్ప బాధ్యత అప్పగించారు. 2024లో ఇంతకంటే గొప్పగా గెలవాలి అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.