ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 నవంబరు 2019 (19:13 IST)

వైఎస్సార్ కాపు నేస్తం పథకానికి ఆమోదం.. కాపు మ‌హిళ‌ల‌కు రూ.15 వేలు

ఏపి సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న వెల‌గ‌పూడి స‌చివాల‌యంలో బుధ‌వారం జ‌రిగిన మంత్రి మండ‌లి స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. వాటిని స‌మావేశం అనంత‌రం రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) సచివాలయంలోని ప్రచార విభాగంలో సమాచార శాఖ కమిషనర్ టి.విజయ్‌కుమార్ రెడ్డితో కలిసి మీడియాకు వివ‌రించారు. 
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు...
* జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు కేబినెట్ ఆమోదం.
* జగనన్న విద్యాదీవెన కింద 100 శాతం ఫీజు రీఎంబర్స్ మెంట్ అందించాలని కేబినెట్ నిర్ణయించింది.
* సంతృప్తస్థాయిలో(సాచ్యురేషన్) జగనన్న విద్యాదీవెన పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది.
* ఎస్సీ, ఎస్టీతో పాటు బీసీ, కాపు, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగులకు ఈ పథకం వర్తింపజేయాలని కేబినెట్ నిర్ణయించింది.
* బీటెక్, బీ ఫార్మసీ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంబీఏ,ఎంసీఏ, బీఈడీ లాంటి కోర్సులకూ పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్ జ‌గ‌నన్న వసతి దీవెన కింద ఏడాదికి భోజన, వసతి కోసం ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది.
* ఐటీఐ చదువుకుంటున్న వారికి ఏడాదికి రూ.10 వేలు, పాలిటెక్నిక్ చదువుతున్న వారికి ఏడాదికి రూ.15 వేలు, డిగ్రీ ఆపై చదువుతున్న వారికి ఏడాదికి రూ.20 వేలు ఇచ్చేందుకు కేబినెట్ అంగీకరించింది.

* అర్హుడైన ప్రతి విద్యార్థికి వసతి, భోజన సదుపాయాల కోసం జగనన్న వసతి దీవెన కింద ఈ నగదును చెల్లించాలని నిర్ణయించింది. డిసెంబరులో 50 శాతం, జులైలో 50 శాతం మొత్తంగా 100 శాతం రెండు విడుతలుగా ప్రతి ఏటా చెల్లించనుంది. ఈ పథకానికి సంబంధించిన నగదును విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేయనుంది.
* విద్యార్థుల వసతి కోసం గతంలో రూ.500 కోట్లు ఖర్చు చేస్తే జగనన్న వసతి దీవెన కింద రూ.2300 కోట్లు ప్రస్తుత ప్రభుత్వం ఇవ్వనుంది.
* జగనన్న విద్యాదీవెన కోసం ఏటా రూ.3400 కోట్లు ఇవ్వనుంది. గత ప్రభుత్వం రూ.1800 కోట్లు మాత్రమే ఖర్చుచేసింది.
 
* జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన రెండు పథకాల కోసం రూ.5700 కోట్లు ప్రభుత్వం ఖర్చుచేయనుంది.
* ప్రస్తుతం లబ్ధిదారుల సంఖ్య 11,44,490 కాగా, నిబంధనలు సడలింపు కారణంగా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
* రూ.2.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న అందరికీ జగనన్న విద్యాదీవెన, జగనన్న విద్యా వసతి పథకాలు వర్తిస్తాయని కేబినెట్ పేర్కొంది.
* 10 ఎకరాల లోపు మాగాణి గానీ లేదా 25 ఎకరాల్లోపు మెట్ట పొలం ఉన్న వారికీ లేదా రెండూ కలిపి 25 ఎకరాల్లోపు ఉన్నవారికి ఈ పథకాలు వర్తిస్తాయని నిబంధనలు సడలించింది.
* ఆదాయంతో సంబంధం లేకుండా పారిశుద్ధ్య కార్మిక ఉద్యోగులున్న కుటుంబాల్లోని వారికీ ఈ పథకం వర్తించనుంది.
* వృత్తిపరంగా కారు, ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్ నడుపుకుంటున్నవారు కూడా అర్హులేనని తాజా నిబంధనల్లో ప్రభుత్వం పేర్కొంది.
* ఆదాయపుపన్ను కట్టేవారిని అనర్హులుగా కేబినెట్ పేర్కొంది.
* పట్టణాల్లో 1500 స్క్వేర్ ఫీట్ స్థిరాస్థి ఉన్నవారికీ వర్తిస్తుందని ప్రభుత్వం తాజా నిబంధనల్లో పేర్కొంది.
* పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ, ఆపై కోర్సులను ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్ అనుబంధ విశ్వవిద్యాలయాలు, బోర్డుల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పథకాలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. 
 
“వైఎస్సార్ కాపు నేస్తం”కు కేబినెట్ ఆమోదం...
* వైఎస్సార్ కాపు నేస్తం పథకం కింద కాపు, బలిజ, ఒంటరి, తెలగ దాని ఉపకులాలల్లోని 45-60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో రూ.75 వేలు ఆర్థికసాయం ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించింది.
* జీవన ప్రమాణాలు పెంచి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకే ఈ ఆర్థికసహాయం చేస్తున్నామని మంత్రిమండలి పేర్కొంది.
* కాపు నేస్తం కోసం ఈ ఏడాది రూ.1101 కోట్లు కేటాయించింది. ప్రతి ఏటా రూ.900 కోట్లు ఖర్చు అవుతుందని కేబినెట్ అంచనా వేసింది.
* కాపుల సంక్షేమం కోసం ఏడాదికి మొత్తంగా రూ.2 వేల కోట్లు కేటాయించింది.
* కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ(రెగ్యులరైజేషన్):
* కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, సంబంధిత అంశాలపై మంత్రుల బృందం(జీఓఎం) కు సలహాలు, సూచనల కోసం అధికారుల బృందం ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
* ప్రభుత్వ ప్రధానకార్యదర్శి అధ్యక్షతన అటవీ, పర్యావరణ, ఆరోగ్య, పంచాయితీరాజ్, పట్టణాభివృద్ధి, పాఠశాలవిద్యాశాఖ కార్యదర్శులతో కూడిన బృందం పర్యవేక్షించనుంది. ఈ అధికారుల బృందానికి కన్వీనర్‌గా ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి వ్యవహరించనున్నారు.
* ఫిబ్రవరి 28, 2019న సీపీఎస్‌పై ఏర్పాటైన టక్కర్‌ కమిటీ నివేదికను అధికారుల బృందం పరిశీలించనుంది. సీపీఎస్‌ ఉద్యోగులకు సంబంధించి  31 మార్చి 2020లోగా అధికారుల బృందం జీఓఎంకు నివేదికను సమర్పించనుంది. అదేవిధంగా కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశంపై  30 జూన్‌ 2020లోగా జీఓఎంకు అధికారుల బృందం నివేదిక సమర్పించనుంది.
 
ట్రైబల్‌ కమ్యూనిటీ హెల్త్‌ లైజన్‌ వర్కర్స్‌ జీతాల పెంపుదలకు కేబినెట్ ఆమోదం...
* గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ లైజన్‌ వర్కర్ల (ఆశా) జీతాలు రూ.400 నుంచి రూ.4000కు పెంపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీనికోసం అదనంగా రూ.14.46 కోట్ల రూపాయల ఖర్చును ప్రభుత్వం భరించనుంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం జీతాల పెంపుదలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తద్వారా 2652 మందికి లబ్ధి చేకూరనుంది.
 
బియ్యం కొత్త కార్డుల జారీకి కేబినెట్‌ ఆమోదం:
* అర్హులైన వారందరికీ సంతృప్తస్థాయిలో బియ్యం కార్డులు జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. బియ్యంకార్డుల జారీకోసం ప్రభుత్వం నిబంధనలను సడలించింది. 2008 తర్వాత అర్హతలను మళ్లీ సమీక్షించలేదని, సమీక్ష చేయాలంటూ ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేయడంతో ఆ మేరకు నిబంధనలను ప్రభుత్వం సడలించింది.
* గతంలో రేషన్‌ ఇవ్వాలంటే గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.5వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.6,250 ఆదాయం ఉన్నవారికే వర్తించేదని, తాజాగా ప్రస్తుత ప్రభుత్వం ఈ నిబంధనలను సడలించింది. ఆ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయం రూ.10వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయం రూ.12 వేలు లోపు ఉన్నవారికి వర్తించేలా మార్పు చేశారు. గతంలో అర్హులై రేషన్‌ దక్కని వారినుంచి దరఖాస్తులు స్వీకరించి ప్రభుత్వం మళ్లీ కార్డులు జారీ చేయనుంది. 
 
ఏపిఎస్‌డిసిఎల్‌ విభజన...
* ఆంధ్రప్రదేశ్‌ సదరన్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌ను రెండుగా విభజించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దీన్ని ఆంధ్రప్రదేశ్‌ సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీగానూ, ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలిమిటెడ్‌గా విభజన చేసేందుకుగానూ కేబినెట్‌ అంగీకారం తెలిపింది.
* ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా బ్యాంకుల నుంచి రుణాల స్వీకరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

పేదలందరికీ ఇళ్లు పథకానికి ఆమోదం..
* వచ్చే ఉగాదినాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సంతృప్త స్థాయిలో అర్హుల ఎంపిక జరగాలని, కులం, వర్గం, రాజకీయాలతో సంబంధం లేకుండా వివక్షకు తావులేకుండా, పారదర్శక విధానంలో లబ్ధిదారుల ఎంపికకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
 
ఏపీఐఐసీకి 50 ఎకరాల భూమి కేటాయింపు..
* విశాఖపట్టణం జిల్లా పరవాడ మండలం తాడిగ్రామంలో ఏపీఐఐసీకి 50 ఎకరాల భూమి కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పారిశ్రామిక వ్యర్థాల నిర్వహణ కోసం కేబినెట్ ఈ భూమి కేటాయించింది. నడికుడి - శ్రీకాళహస్తి బ్రాడ్‌ గేజ్‌ లైన్‌ నిర్మాణంకోసం భూమి కేటాయింపు.
* నడికుడి - శ్రీకాళహస్తి బ్రాడ్‌ గేజ్‌ లైన్‌ నిర్మాణంకోసం దక్షిణ మధ్య రైల్వేకు ఉచితంగా 92.05 ఎకరాల భూమి కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
 
ఎక్సైజ్‌ యాక్ట్‌‌లో సవరణలకు ఓకే : 
* ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్‌ చట్టంలో సవరణలకు సంబంధించిన ముసాయిదా బిల్లులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వీటిని రానున్న అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
* మద్యం ధరలను పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం. కడప స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపనకు కేబినెట్‌ ఆమోదం.
* ఈ డిసెంబర్‌ 26న కడప స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన కోసం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కడప జిల్లా జమ్మల మడుగు మండలం సున్నపురాళ్ల పల్లి మరియు పెద్ద నందలూరు గ్రామాల మధ్య శంకుస్థాపన చేయనుంది. దీనికోసం ఏపీ హై గ్రేడ్‌ స్టీల్‌ కార్పొరేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. 
 
* ఈ స్టీల్‌ ప్లాంట్‌ కోసం 3,295 ఎకరాల భూమి సేకరించాలని నిర్ణయించింది. 
* ఇనుప ఖనిజం సరఫరాకు ఎన్‌ఎండీసీతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది.
* ఆంధ్రప్రదేశ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషన్‌ పరిధిలోకి ఇంటర్‌ విద్యను చేర్చుతూ ముసాయిదా బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
* తిరుమల తిరుపతి దేవస్ధానం బోర్డులో సభ్యుల సంఖ్యను 19 నుంచి 29కి పెంచుతూ దేవాదాయశాఖ చట్టంలో సవరణలు కోసం తీసుకున్న నిర్ణయానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
* షెడ్యూల్ట్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలకు వేర్వేరుగా కమిషన్‌ ఏర్పాటుకు కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్.
* ఏపి స్టేట్‌ కమిషన్‌ ఫర్‌ షెడ్యూల్డ్‌ కేస్ట్‌ అండ్‌ షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ యాక్ట్‌  సవరణకు కేబినెట్‌ ఆమోదం. 
* వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వేరు వేరు కమిషన్ల ఏర్పాటుకు బిల్లు ప్రవేశపెట్టనుంది.