శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 15 మార్చి 2019 (16:29 IST)

వైఎస్ వివేకానందరెడ్డిని చంపేశారు... శరీరంపై 7 కత్తిపోట్లు : కడప ఎస్పీ

మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వై.ఎస్.వివేకానంద రెడ్డిని హత్య చేసినట్టు కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్‌శర్మ వెల్లడించారు. ఆయన శరీరంపై ఏడు కత్తిపోట్లు ఉన్నట్టు చెప్పారు. అందువల్ల వివేకా మృతి కేసును హత్య కేసుగా నమోదు చేసినట్టు చెప్పారు. ఐపీసీ 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు ఆయన వెల్లడించారు. వివేకా హత్య జరిగిన ప్రాంతాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం చీఫ్ అమిత్ గార్గ్ శుక్రవారం పరిశీలించారు. శుక్రవారం తెల్లవారుజామున తన నివాసంలోని బాత్రూమ్‌లో వైఎస్ వివేకానంద రెడ్డి శవమై కనిపించిన విషయం తెల్సిందే. 
 
ఆ తర్వాత ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. వివేకా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టానికి తరలించారు. ఇందులో పోస్ట్ మార్టం ప్రాథమిక నివేదికలో వివేకానంద రెడ్డిని హత్య చేసినట్టు వెల్లడైంది. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో వివేకా మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయింది. రిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో పోస్ట్ మార్టం నిర్వహించారు. 
 
అనంతరం పులివెందులలోని ఆయన నివాసానికి భౌతికకాయాన్ని తరలించారు. వివేకా నివాసం వద్ద భారీ సంఖ్యలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. మంచి వ్యక్తిత్వం కలిగిన ప్రజానేతను కోల్పోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో వివేకా మృతి దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేశారు.