శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By
Last Updated : బుధవారం, 17 జులై 2019 (21:32 IST)

హఫీజ్ సయీద్‌‌ను అరెస్ట్ చేసిన పాకిస్తాన్... ప్రధాని ఇమ్రాన్ అమెరికా వెళ్లే ముందు...

2008 ముంబయి ఉగ్రదాడుల వెనుక మాస్టర్ మైండ్‌గా భావిస్తున్న హఫీజ్ సయీద్‌ను పాకిస్తాన్ లాహోర్‌లో అరెస్ట్ చేశారు. పంజాబ్‌లో ఉగ్రవాద వ్యతిరేక విభాగానికి చెందిన ఒక కేసులో అరెస్టయ్యే ముందు బెయిల్ కోసం గుజ్రాన్‌వాలా వెళ్తున్న సమయంలో హఫీజ్‌ను అరెస్ట్ చేశారు. ఉగ్రవాద వ్యతిరేక విభాగం వివరాల ప్రకారం, తర్వాత అతడిని లాహోర్‌లోని కోట్ లఖ్పత్ జైలుకు తరలించారు. 30 రోజుల తర్వాత హఫీజ్ సయీద్‌ను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.

 
హఫీజ్ సయీద్ ముంబై దాడుల్లో నిందితుడు. ఉగ్రవాద కార్యకలాపాల కోసం నిధులు సేకరిస్తున్నారనే ఆరోపణలతో పాకిస్తాన్ అతడిని అరెస్టు చేసింది. హఫీజ్ సయీద్‌పై ప్రధానంగా నిషేధిత సంస్థల కోసం చందాలు సేకరిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయని, అది చట్టవిరుద్ధం అని పాకిస్తాన్ పంజాబ్ గవర్నర్ షాహబాజ్ గిల్ ప్రతినిధి చెప్పారు.

 
నిజానికి, తీవ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ చర్యలు తీసుకుంటోందని ప్రపంచానికి ఒక సందేశం వెళ్లేలా, ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ వాషింగ్టన్ పర్యటనకు వెళ్లే కొన్ని రోజుల ముందు హఫీజ్ సయీద్‌ను అరెస్టు చేశారు. జమాత్-ఉద్-దావా చీఫ్ హఫీజ్ సయీద్‌కు వ్యతిరేకంగా జులై మొదటి వారంలో కేసులు నమోదయ్యాయి.

 
హఫీజ్ సయీద్‌తోపాటు లష్కరే తోయిబా, ఫలాహ్-ఎ-ఇన్సానియత్ ఫౌండేషన్‌కు చెందిన 13 మందికి వ్యతిరేకంగా పంజాబ్‌లోని వేరు వేరు ప్రాంతాల్లో 23 కేసులు నమోదైనట్లు ఉగ్రవాద వ్యతిరేక విభాగం చెప్పింది. రెండు రోజుల క్రితమే, జమాత్-ఉద్-దావా కోసం భూమిని అక్రమంగా ఉపయోగించిన ఒక కేసులో 50 వేల రూపాయలు పూచీకత్తుపై సయీద్, మరో ముగ్గురికి యాంటీ టెర్రరిజం కోర్ట్ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

 
తీవ్రవాదం కోసం సేకరించిన నిధులతో చాలా ప్రభుత్వేతర సంస్థలు ఏర్పాటు చేశారని, వాటిని ఉపయోగిస్తూ తీవ్రవాద కార్యకలాపాలకు నిధులు సేకరిస్తున్నారని హఫీజ్ సయీద్‌పై ఆరోపణలున్నాయి. జమాత్-ఉద్-దావా ప్రతినిధి అహ్మద్ నదీమ్ బీబీసీతో "హఫీజ్‌పై ఎఫ్ఐఆర్‌కు వ్యతిరేకంగా లాహోర్ హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశాం. దీనిపై జులై 30లోగా సమాధానం ఇవ్వాలని హోంశాఖ అధికారులకు కోర్టు సమ్మన్లు జారీ చేసింది" అని చెప్పారు.

 
హఫీజ్‌పై ఆరోపణలేంటి
పాకిస్తాన్ పంజాబ్ ఉగ్రవాద వ్యతిరేక విభాగం జారీ చేసిన ఒక ప్రకటనలో జమాత్-ఉద్-దావా, లష్కరే తోయిబా, ఫలాహ్-ఎ-ఇన్సానియత్ ఫౌండేషన్లలో భారీ స్థాయిలో దర్యాప్తు ప్రారంభించామని తెలిపింది. "ఈ సంస్థ ద్వారా సేకరించిన డబ్బును ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారని తెలిపింది. వీటిని ప్రభుత్వేతర సంస్థలు లేదా సంక్షేమ సంస్థలని చెబుతున్నారు. ఇలాంటి సంక్షేమ సంస్థల్లో దావతుల్ రషాద్ ట్రస్ట్, మాజ్-బిన్-జబ్ల్ ట్రస్ట్, ఇలాన్‌ఫాల్ ట్రస్ట్, అల్-హమ్ద్ ట్రస్ట్, అల్-మదీనా ఫౌండేషన్ ట్రస్ట్ ఉన్నాయి" అని అందులో తెలిపారు.

 
హఫీజ్ సయీద్, మరో 12 మందికి వ్యతిరేకంగా ఉగ్రవాద వ్యతిరేక చట్టం 1997 ప్రకారం ప్రత్యేక కోర్టులో విచారణలు జరుగుతాయని ఉగ్రవాద వ్యతిరేక విభాగం చెప్పింది.

 
పాకిస్తాన్ ఈ చర్యకు కారణం
దీనికి సమాధానంగా పాకిస్తాన్ భద్రతా అంశాల నిపుణులు ఆమిర్ రాణా "ఇటీవల కేసుల ద్వారా ఒక విషయం అర్థమవుతోంది. ప్రపంచమంతా ఆమోదించిన తీవ్రవాద భావనను పాకిస్తాన్ మొదటిసారి అంగీకరించింది" అన్నారు. పాకిస్తాన్ ఇంతకు ముందు దేశంలోని ఉగ్రవాద సంస్థలను వివిధ రకాలుగా, అంటే యాక్టివ్‌గా ఉన్నవి, లేనివి, నేరుగా దేశానికి ప్రమాదకరంగా మారినవి అంటూ విభజించేది. పారిస్‌లో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) ఇటీవలి సమావేశంలో ఈ సంస్థలకు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం లేదని పాకిస్తాన్ చెప్పింది.

 
దానికంటే ఎక్కువ ముప్పు తహ్రీక్-ఎఎ-తాలిబాన్ పాకిస్తాన్ లేదా ఐఎస్ఐఎస్ లాంటి మరింత ప్రమాదకర గ్రూపుల నుంచే ఉంది. అయితే, గ్లోబల్ కమ్యూనిటీ ఈ అన్ని సంస్థల నుంచీ ఒకే విధంగా ప్రమాదం ఉందని భావిస్తోంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను కలవడానికి వెళ్తున్నారు. అలాంటప్పుడు ప్రభుత్వం ఆయనతో సమావేశానికి ముందు ప్రభుత్వం పోషించబోయే పాత్రగా ఈ చర్యలను చూడవచ్చు.

 
ఎవరీ హఫీజ్ సయీద్
1990లో సయీద్ పాకిస్తాన్ కేంద్రంగా లష్కరే తోయిబా మిలిటెంట్ గ్రూపును ఏర్పాటు చేశారు. ఆ సంస్థపై నిషేధం విధించడంతో, 2002లో జమాత్-ఉద్-దావా అనే మరో సంస్థలో చేరారు. హఫీజ్ "జుద్" అనే ఇస్లామిక్ సంక్షేమ సంస్థను నడుపుతున్నారు. అయితే, "అది సంక్షేమ సంస్థ కాదు, ఉగ్రవాద కూటమి" అంటూ అమెరికా ఆరోపించింది. 2001లో భారత పార్లమెంటుపై దాడి జరిగినప్పుడు సయీద్‌కు పాక్ ప్రభుత్వం 3 నెలల పాటు గృహ నిర్బంధం విధించింది.