శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (19:00 IST)

సీఎం జగన్ సర్కారు దొంగదెబ్బ... వాహనదారులకు షాక్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపా సర్కారు మరోమారు దొంగదెబ్బ కొట్టింది. ఈ దెబ్బకు వాహనదారులు తేరుకోలేని షాక్‌కు గురయ్యారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రహదారి అభివృద్ధి నిధి కోసం సెస్ వసూలుకు శ్రీకారం చుట్టింది. తద్వారా పెట్రోల్, డీజిల్ కొట్టించుకునే వాహనదారులపై అదనంగా రూ.600 కోట్ల మేరకు భారం మోపింది. అంటే.. లీటరు పెట్రోల్, డీజల్‌పై ఒక్క రూపాయి చొప్పిన సెస్ వసూలు చేయనుంది. ఈ మేరకు పెట్రోల్, హైస్పీడ్ డీజిల్‌పై సెస్ విధిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. 
 
వ్యాట్‌కు అదనంగా లీటర్‌ పెట్రోల్, హైస్పీడ్ డీజిల్‌పై రూ.1 సెస్ విధించింది. డీలర్ నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. రహదారి అభివృద్ధి నిధి కోసం సెస్ వసూలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సెస్ ద్వారా రూ.600 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 
 
వాస్తవానికి ఈ నెల మూడో తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ సెస్ బాదుడుకు ఆమోదముద్రవేసింది. అయితే, వరుసగా పెంచుతున్న పన్నుల వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని భావించి రహస్యంగా ఉంచింది. ఎట్టకేలకు దీనిపై అధికారికంగా శుక్రవారం జీవో జారీచేసింది. 
 
కాగా, వైసీపీ అధికారంలోకి వచ్చేనాటికి పెట్రోలు, డీజిల్‌పై రూ.2 చొప్పున అదనపు వ్యాట్‌ ఉంది. పెట్రో ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోల్పోకుండా అదనపు పన్నును ఒకసారి శాతంలోకి తీసుకెళ్లి, కొన్ని రోజులకే మళ్లీ రూపాయల్లోకి తీసుకొచ్చింది దొంగచాటుగా బాదుతోంది.