శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 3 డిశెంబరు 2018 (14:40 IST)

పైలట్లకు జ్వరం - నిలిచిన 14 జెట్ ఎయిర్‌వేస్ విమానాలు

జెట్ ఎయిర్‌వేస్... దేశంలో ఉన్న ప్రైవేట్ విమానయాన సంస్థల్లో ఒకటి. అసలే ఆర్థిక కష్టాలు.. నష్టాలు.. అప్పులు ఊబి. వీటికితోడు మరో కష్టం వచ్చిపడింది. ఈ సంస్థలో పనిచేసే పైలెట్లందరికీ ఒకేసారి జ్వరం (అనారోగ్యం) వచ్చిందట. దీంతో వారంతా సిక్ లీవ్ పెట్టారు. ఫలితంగా ఆదివారం ఒక్కరోజే ఏకంగా 14 విమాలను జెట్ ఎయిర్‌వేస్ రద్దు చేసింది. 
 
ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో మునిగి, నష్టాల నుంచి తేరుకునే మార్గం కోసం వెతుక్కుంటున్న జెట్ ఎయిర్‌వేస్.. సెప్టెంబర్ నెలలో సగం వేతనం చెల్లించింది. మిగిలిన వేతనంతో పాటు అక్టోబరు, నవంబరు నెలల వేతనాన్ని పెండింగులో పెట్టింది. దీంతో పైలెట్స్‌లో చాలామంది మూకుమ్మడిగా సెలవులు పెట్టేశారు. జ్వరంతో బాధపడుతున్నామని విధులకు హాజరుకాలేమని సెలవు సందేశం పంపించారు. దీంతో జెట్ ఎయిర్‌వేస్ సంస్థకు దిమ్మ తిరిగిపోయింది. 
 
పలువురు పైలెట్లు తమకు అనారోగ్యంగా ఉందని చెబుతూ మూకుమ్మడిగా సిక్ లీవు పెట్టడంతో 14 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో ఆ విమానాల సర్వీసుల్లో ప్రయాణించాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫలితంగా జెట్ ఎయిర్‌వేస్ అధికారులతో ప్రయాణీకులు వాగ్వాదానికి దిగారు. పైలట్లు సహకరించని కారణంగానే విమానాలను రద్దు చేశామని, దీని కారణంగా దాదాపు 100కు పైగా సర్వీసులు నిలిచిపోయాయని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.