శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 6 జులై 2018 (16:54 IST)

విజయ్ మాల్యాకు బ్రిటన్ కోర్టు ఝలక్.. ఎస్‌బీఐ ఎండీ అరిజిత్ హ్యాపీ హ్యాపీ

బ్యాంకులకు వేల కోట్ల మేర రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో లగ్జరీ లైఫ్ గడుపుతున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు బ్రిటన్ కోర్టు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేయడంపై ఎస్‌బీఐ మేనేజింగ్ డైరక్టర్ అరిజిత్‌ బసు హర్షం వ

బ్యాంకులకు వేల కోట్ల మేర రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో లగ్జరీ లైఫ్ గడుపుతున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు బ్రిటన్ కోర్టు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేయడంపై ఎస్‌బీఐ మేనేజింగ్ డైరక్టర్ అరిజిత్‌ బసు హర్షం వ్యక్తం చేశారు. తమ బకాయిలు వసూలు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ 13 బ్యాంకుల కన్సార్షియం వేసిన పిటిషన్‌ను విచారించిన బ్రిటన్‌ హైకోర్టు జడ్జి ఈ మేరకు సానుకూల ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ఇంకా లండన్‌ సమీపంలోని హెర్ట్‌ఫోర్డ్‌ షైర్‌లో ఉన్న మాల్యా ఆస్తుల్లోకి ప్రవేశించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారికి, ఆయన ఏజెంట్లకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. హైకోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి.. తన అధికార పరిధిలో మాల్యాకు చెందిన వస్తువులను జప్తు చేసేందుకు, సోదాలు చేసేందుకు అనుమతిస్తున్నట్టు జస్టిస్‌ బిరాన్‌ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. 
 
ఇకపోతే.. మాల్యాకు చెందిన దేశీయ ఆస్తుల వేలంతో రూ.963 కోట్లను రికవరీ చేసుకున్నామని అరిజిత్‌ బసు తెలిపారు. ఇక బ్రిటన్ కోర్టు కూడా మాల్యాకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. మాల్యాను తమకు అప్పగించాలని కోరుతూ భారత ప్రభుత్వం చేసుకున్న అభ్యర్థనపై లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మాజిస్ర్టేట్‌ కోర్టులో జూలై 31న విచారణ జరుగనుంది.