శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 నవంబరు 2020 (13:57 IST)

ముక్కు ద్వారా కరోనా వ్యాక్సిన్.... సింగిల్ డోస్‌తో ఖేల్ ఖతం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తికి చెక్ పెట్టేందుకు అమెరికాకు చెందిన రెండు బయోటెక్ కంపెనీలు వ్యాక్సిన్లను తయారు చేశారు. ఇందులో ఒక వ్యాక్సిన్ పేరు ఫైజర్ కాగా, మరొక వ్యాక్సిన్ పేరు మోడెర్నా. అలాగే, హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ కూడా కోవ్యాక్సిన్‌ పేరుతో ఓ టీకాను తయారు చేసింది. దీని ప్రయోగ పరీక్షల్లో చిట్టచివరిదైన మూడోదశలోకి ప్రవేశించింది. ఈవిషయాన్ని ఆ కంపెనీ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) కృష్ణ ఎల్లా వెల్లడించారు. 
 
'కరోనా కాలంలో సంక్షోభం, సహకారం' అనే అంశంపై గచ్చిబౌలిలోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ) సోమవారం నిర్వహించిన 'డెక్కన్‌ డైలాగ్' ఆన్‌లైన్‌ సదస్సులో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కోవ్యాక్సిన్‌ను రెండు డోసుల్లో వేయించుకోవాల్సి ఉంటుందని.. దేశంలోని 130 కోట్ల జనాభాకు దీన్ని అందించాలంటే 260 కోట్ల సిరంజ్‌లు, సూదులు అవసరం అవుతాయన్నారు. 
 
ఇది చాలా కష్టమని.. అందుకే ముక్కు ద్వారా ఒక్క డోసు వేస్తే సరిపోయే 'నాజల్‌ డ్రాప్' కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధిపై దృష్టిసారించామని కృష్ణ ఎల్లా ప్రకటించారు. అది వచ్చే ఏడాది ప్రజలకు అందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. దీనితో అంగన్‌వాడీలు, ఇతర ప్రభుత్వ సిబ్బంది సేవలను వినియోగించుకొని దేశ ప్రజలందరికీ ఒక్క ఏడాదిలోగా వ్యాక్సినేషన్‌ చేయొచ్చన్నారు. 
 
అంతేకాకుండా, మూడో దశ ట్రయల్స్‌లో భాగంగా దేశంలోని 25 కేంద్రాల్లో 26 వేల మంది వలంటీర్లపై కోవ్యాక్సిన్‌ను పరీక్షిస్తామన్నారు. దీంతో కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ కోసం భారత్‌లో జరుగుతున్న అతిపెద్ద క్లినికల్‌ ట్రయల్‌గా ఇది నిలుస్తుందన్నారు.