1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 జూన్ 2020 (12:54 IST)

రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా కేసులు.. వణికిపోతున్న ప్రజలు

దేశంలో కరోనా కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ కేసుల సంఖ్యను చూస్తే ప్రజలతో పాటు ప్రభుత్వాలు కూడా వణికిపోతున్నాయి. ఈ వైరస్ వ్యాప్తిని ఏ విధంగా అడ్డుకోవాలన్న అంశంపై మల్లగుల్లాలు పడుతున్నారు. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల మేరకు.. గత 24 గంటల్లో దేశంలో 11,929 మందికి కొత్తగా కరోనా సోకింది. 
 
ఇప్పటివరకు ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. అదే సమయంలో 311 మంది మరణించారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 3,20,922కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం  9,195కి పెరిగింది. 1,49,348  మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,62,379 మంది కోలుకున్నారు. 
 
ముఖ్యంగా, గడచిన 8 రోజుల వ్యవధిలో ఆరు రోజుల పాటు కేసుల సంఖ్య విషయంలో రికార్డులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య 3 లక్షలు దాటిన రెండు రోజుల్లోనే 3.21 లక్షలకు పైగా చేరుకోవడం గమనార్హం.
 
ఇక శనివారం నాడు 310 మంది కన్నుమూయగా, మొత్తం మరణాల సంఖ్య 9,195కు చేరింది. ప్రపంచంలో వైరస్ కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో ఇండియా ఇప్పుడు 9వ స్థానానికి చేరుకుంది. మొత్తం కేసుల విషయంలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. గత 10 రోజులుగా మరణాల సంఖ్య పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. మే ఆరంభంతో పోలిస్తే, నెలాఖరుకు మరణాల సంఖ్య రెట్టింపయింది.
 
కాగా, దేశంలో తొలి కేసు మార్చి 12న నమోదుకాగా, ఇప్పటివరకూ నమోదైన మొత్తం కేసుల్లో మూడింట ఒక వంతు కేసులు గత పది రోజుల్లోనే రావడం, మహమ్మారి వ్యాప్తి ఎంత వేగంగా కొనసాగుతోందో చెప్పకనే చెబుతోంది. 
 
శనివారం నాటి కేసుల్లో మహారాష్ట్రలో 3,427 కేసులు రాగా, ఢిల్లీలో 2,134 కేసులు, తమిళనాడులో 1948 వచ్చాయి. కొత్త కేసుల విషయంలో తెలంగాణ (253), ఆంధ్రప్రదేశ్ (222), ఒడిశా (225), లడక్ (198), సిక్కిం (33) రాష్ట్రాలు రికార్డును సృష్టించాయి.