శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 20 జులై 2020 (15:51 IST)

తమిళనాడును మించిన ఏపీ, కరోనావైరస్ ఈ రోజు బులిటెన్ ఎంతో? (video)

రాష్ట్రంలో 19వ తేదీనాడు 31 వేల 148 శాంపిల్స్ పరీక్షిస్తే 5,041 మందికి కరోనావైరస్ పాజిటివ్‌గా తేలింది. 1106 మంది కోవిడ్ నుండి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. కరోనావైరస్ కారణంగా తూర్పుగోదావరి జిల్లాలో 10 మంది, శ్రీకాకుళంలో ఎనిమిది మంది, కర్నూలు జిల్లాలో ఏడుగురు, విశాఖలో ఏడుగురు, కృష్ణాలో ఏడుగురు, ప్రకాశంలో నలుగురు, అనంతపురం జిల్లాలో ముగ్గురు, కడపలో ముగ్గురు, విజయనగరంలో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు మరణించారు. ఒకేరోజు 54 మంది మృతి చెందడంతో ఆందోళన రేకెత్తిస్తోంది.
 
కాగా ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన మొత్తం 46,755 పాజిటివ్ కేసులకు గాను 20,329 మంది డిశ్చార్జ్ కాగా 642 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 25,784. ఐతే కరోనావైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా వచ్చినవారిలో అధికులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు అయినప్పటికీ వారి ద్వారా ఎంతమందికి కాంటాక్ట్ అయ్యి వుంటుందోనన్న ఆందోళనలు రేగుతున్నాయి.
 
కాగా కరోనావైరస్ కేసుల విషయంలో ఆంధ్రప్రదేశ్ నిన్న తమిళనాడు రాష్ట్రాన్ని మించిపోయింది. దేశంలో హాట్ స్పాట్‌గా పేరున్న తమిళనాడులో ఆదివారం నాడు 4,979 కరోనావైరస్ కేసులు నమోదు కాగా ఏపీలో ఈ సంఖ్య 5,041గా వుంది. దీనితో ఇవాల్టి బులిటెన్ ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకూ విడుదల చేయలేదు. కేసులు మరింత ఎక్కువయ్యాయా అనే ఆందోళన నెలకొంది.