శనివారం, 21 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 జూన్ 2021 (11:24 IST)

2 శాతం దిగువకు క్రియాశీల రేటు : కొత్తగా మరో 48 వేల పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా కేసులో మరోమారు తగ్గాయి. 50 వేల దిగువకు చేరుకున్నాయ. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. తాజాగా 17,45,809 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..48,698 కొత్త కేసులు వెలుగుచూశాయి. 
 
క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 5.7 శాతం తగ్గుదల కనిపించింది. ఈ నెలలో రెండోసారి రోజువారీ కేసులు 50వేల దిగువకు చేరాయి. తాజాగా మరో 1,183 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్యలో కూడా తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం మొత్తం కేసులు 3,01,83,143కి చేరగా.. 3,94,493 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
నిజానికి గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్న విషయం తెల్సిందే. తాజాగా 6 లక్షల దిగువకు చేరాయి. క్రియాశీల రేటు 1.97 శాతానికి తగ్గగా.. రికవరీరేటు 96.72 శాతానికి పెరిగింది. శుక్రవారం 64,818 మంది కోలుకున్నారు. 
 
మొత్తం రికవరీలు 2.91 కోట్లకు చేరాయి. ఇదిలావుంటే, రెండో దఫా వైరస్‌ విజృంభణ తగ్గుముఖం పడుతున్న క్రమంలో.. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ వ్యాప్తి కలవరపెడుతోంది. ప్రస్తుతం 11 రాష్ట్రాల్లో 48 డెల్టాప్లస్ కేసులు వెలుగుచూశాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
 
ఇంకవైపు, కొద్ది రోజులుగా కరోనా టీకా కార్యక్రమం వేగం పుంజుకుంది. శుక్రవారం 61,19,169 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 31,50,45,926కి చేరినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది.