మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 18 మార్చి 2020 (11:18 IST)

కరోనా విరుగుడుకు టీకా... భారత్‌తో సహా 10 దేశాల్లో ట్రయల్స్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు ఇప్పటివరకు మందులేదు. ఈ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలోకిదిగింది. ఈ వైరస్‌ను ఒక మహమ్మారిగా ప్రకటించింది. అదేసమయంలో ఈ వైరస్‌కు విరుగుడుగా టీకాను కనిపెట్టే పనిలో పరిశోధనల్లో నిమగ్నమైంది. 
 
ఈ క్రమంలో కరోనాకు టీకాను కనుగోనేందుకు ప్రపంచవ్యాప్తంగా భారత్, అమెరికా సహా 10 దేశాల్లో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం అయ్యాయి. ఈ వైరస్ సోకిన, సోకని వారిలో ఎంపిక చేసిన యువతీ యువకులకు వ్యాక్సిన్‌ను ఎక్కిస్తున్నారు. వీటి ఫలితాలను అనుసరించే ఎంతకాలంలోగా వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్న విషయం తేలుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
 
ఇక ఈ వ్యాక్సిన్‌కు సైంటిస్టులు 'ఎంఆర్ఎన్ఏ-1273' (మెసింజర్ రైబోన్యూక్లిక్ యాసిడ్ - 1273) అని పేరు పెట్టారు. అమెరికాలో 45 మందికి ఈ వ్యాక్సిన్‌ను ఇప్పటికే ఎక్కించి, వారి ఆరోగ్య స్థితిగతులను అనుక్షణం గమనిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ ఎక్కించుకుంటే, ఎటువంటి ప్రాణాపాయమూ ఉండదని, కొంత శ్వాస సమస్యలు, జలుబు మాత్రం రావచ్చని అంటున్నారు.
 
ఇక వ్యాక్సిన్ అభివృద్ధిలో చైనా, యూఎస్ఏ, ఇండియా, ఆస్ట్రేలియా, బ్రిటన్, జర్మనీ, ఇజ్రాయెల్ తదితర దేశాలు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్ పని చేస్తుందని నిర్దారించినా, అది పూర్తి స్థాయిలో ప్రపంచానికి అందుబాటులోకి వచ్చేందుకు ఒక సంవత్సరం నుంచి 18 నెలల వరకూ సమయం పడుతుందని అంచనా.