గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 16 ఫిబ్రవరి 2019 (19:33 IST)

పుల్వామా దాడి: పాకిస్థాన్‌పై క్రికెటర్ల ఫైర్ (వీడియో)

పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో ప్రతి ఏటా టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తన ఫౌండేషన్‌ ద్వారా అందించే అవార్డుల కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. రెండు రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో సుమారు 42 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించడం మంచిది కాదని ఆ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు కోహ్లీ ట్విటర్‌లో పేర్కొన్నాడు. 
 
అంతేగాకుండా పుల్వామా ఘటన నేపథ్యంలో పాకిస్థాన్‌కు టీమిండియా స్టార్ క్రికెటర్లు గట్టి వార్నింగ్ ఇచ్చారు. పాకిస్థాన్ ఉగ్రమూకలు 40కి పైబడిన సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకోవడంపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. టీమిండియా క్రికెటర్లు కూడా పాక్‌పై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

పుల్వామా ఘటనపై టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పాడు. వీరమరణం చెందిన జవాన్ల కోసం దేశ ప్రజలందరూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారన్నాడు. 
 
ఇంకా ఓపెనర్ శిఖర్ ధావన్ మాట్లాడుతూ.. ఆది నుంచే పాకిస్థాన్.. సరిహద్దుల్లో ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతూ వస్తుందని ఫైర్ అయ్యాడు. పాకిస్థాన్ సర్కార్ ఉగ్రమూకల అణచివేతకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నాడు. ఇకనైనా పాకిస్థాన్ ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాలని చెప్పాడు. 
 
అలాగే కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడాన్ని విని దిగ్భ్రాంతికి గురైయ్యామని తెలిపాడు. ఈ దాడిలో వీర మరణం పొందిన సైనికులకు వారి కుటుంబాలకు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాడు. గాయాలపాలైన జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆశించారు. 
 
అదేవిధంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పుల్వామా దాడిపై స్పందించాడు. వీర మరణం పొంది దేశానికి సీఆర్పీఎఫ్ జవాన్లు సేవ చేస్తే.. వారి కుటుంబీకులు వారిని జీవితంతాం కోల్పోయి దేశానికి అతిపెద్ద త్యాగం చేస్తున్నారని తెలిపాడు. జవాన్లపై ఆత్మాహుతి దాడి తీవ్ర వేదనకు గురిచేసిందని.. ఉగ్రమూకలు ఏర్పరిచిన ఈ గాయానికి మందే లేదని డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. 
 
వీరితో పాటు మిగిలిన క్రికెటర్లు కూడా కాశ్మీర్‌లో జరిగిన ఈ దాడిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాడు. ఇంకా ఉగ్రవాదులను కట్టడి చేయడంలో పాకిస్థాన్ మేలుకోవాలని.. లేకుంటే పరిణామాలు వేరేలా వుండే అవకాశం వుందని హెచ్చరిస్తున్నాడు.