బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 మార్చి 2020 (15:54 IST)

ఐపీఎల్2020పై కరోనా పడగ... వాయిదా దిశగా అడుగులు?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 పోటీలపై కరోనా వైరస్ పగబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ విజృంభిస్తుండటంతో ఈ ఐపీఎల్ టోర్నీ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే కర్నాటక ప్రభుత్వం ఈ పోటీలను తమ రాష్ట్రంలో నిర్వహించవద్దని కేంద్రానికి లేఖ కూడా రాశాయి. అలాగే, మహారాష్ట్ర కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ పోటీల నిర్వహణకు సమ్మతం తెలుపుతూనే, క్రికెట్ స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించబోమని స్పష్టంచేసింది. తమ రాష్ట్రంలో అధికారికంగా ఐపీఎల్‌ టికెట్ల అమ్మకాలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంటే, క్రికెట్ అభిమానులు లేకుండా ఐపీఎల్ టోర్నీ మ్యాచ్‌లను నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఫలితంగా ఐపీఎల్ టోర్నీ నిర్వహణ ఇపుడు సందేహాస్పదంగా మారింది. 
 
మరోవైపు, ఈ నెల 29వ తేదీ నుంచి ఈ టోర్నీ ఆరంభంకానుంది. తొలి మ్యాచ్ ముంబైలోనే జరుగనుంది. అయితే, దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. దీంతో కేంద్రం కూడా కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా ఏప్రిల్ నెల 15వ తేదీ వరకు అన్ని రకాల వీసాలను రద్దు చేసింది. ఈ నేప‌థ్యంలో విదేశీ క్రికెట‌ర్స్ లేకుండా ఐపీఎల్ మ్యాచ్‌లు ఎలా జ‌రుగుతాయా అనే సందేహం స‌గ‌టు అభిమానుల‌లో క‌లుగుతుంది. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ జ‌ర‌గాలంటే ప్రభుత్వం ముందు రెండు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి అని ఆరోగ్య శాఖ మంత్రి రాజే తోపే వెల్ల‌డించారు. ఒకటి ఐపీఎల్‌ను వాయిదా వేయడం లేదా మ్యాచ్‌లు జరిగినా ప్రేక్షకులను అనుమతించకుండా టీవీలకే పరిమితం చేయడం అని పేర్కొన్నారు. ఇక భారత్‌కి తప్పనిసరిగా రావాలి అనుకునే విదేశీయులు.. ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాన్ని ముందుగా సంప్రదించాలని కేంద్ర ప్రభుత్వం ఓ వెసులబాటుని కల్పించింది. మ‌రి ఇన్ని అవాంతారాల మ‌ధ్య ఐపీఎల్ -2020 నిర్వాహ‌ణ ఎంత వ‌ర‌కు సాధ్యం అన్న‌ది క్రికెట్ ప్రేమికుల‌కి ఓ ప్రశ్న‌గా మారింది.