శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 13 నవంబరు 2021 (09:03 IST)

అన్ని ఫార్మెట్ల కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్‌బై : రవిశాస్త్రి

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్ని ఫార్మెట్ల నుంచి త్వరలోనే తప్పుకుంటారని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి తెలిపారు. కోహ్లీ మానసికంగా అలసిపోయానని అనిపించినప్పుడు.. బ్యాటింగ్‌పై దృష్టి సారించాలని కోరుకున్నప్పుడు కెప్టెన్సీని పూర్తిగా వదిలిపెట్టేందుకు ఆస్కారముందన్నారు. 
 
ఇదే అంశంపై రవిశాస్త్రి మాట్లాడుతూ, 'టెస్టు క్రికెట్లో విరాట్‌ కోహ్లి సారథ్యంలోని భారత్‌ జట్టు గత అయిదేళ్లుగా నంబర్‌వన్‌గా ఉంది. తాను మానసికంగా అలసిపోయానని అనిపించినప్పుడు లేదా బ్యాటింగ్‌పై దృష్టి సారించాలని భావించినప్పుడు సమీప భవిష్యత్‌లో కోహ్లి కెప్టెన్సీని పూర్తిగా విడిచిపెట్టే అవకాశాలను కొట్టి పారేయలేమన్నారు. 
 
తాజాగా పరిమిత ఓవర్ల క్రికెట్లో (ట్వంటీ20) ఇదే జరిగిందని గుర్తుచేశారు. టెస్టు కెప్టెన్సీపై దృష్టి సారించడం కోసం అతడు టీ20 సారథ్యాన్ని వదులుకున్నాడు. త్వరలో బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందుకు పూర్తిగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవచ్చేమో. కోహ్లీ మాత్రమే కాదు ఎంతో విజయవంతమైన క్రికెటర్లు.. బ్యాటింగ్‌పై మరింత శ్రద్ధ పెట్టేందుకు సారథ్యాన్ని వదిలేశారు. అయితే టెస్టు క్రికెట్లో కోహ్లి ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం తీసుకోకపోవచ్చు' అని శాస్త్రి వివరించారు.