మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 21 ఫిబ్రవరి 2019 (16:04 IST)

పాకిస్థాన్‌ను బహిష్కరించడం కాదు.. చిత్తుగా ఓడించాలి: సన్నీ

వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్ వద్దని టీమిండియా మాజీలు పట్టుబడుతున్నారు. పాకిస్థాన్‌తో ఒక్క క్రికెటే కాదు.. హాకీ.. ఫుట్‌బాల్, ఇలా క్రీడా సంబంధాలను రద్దు చేసుకోవాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సూచించాడు. వన్డే ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌ను భారత్ బహిష్కరించాలనే హర్భజన్ సింగ్ డిమాండ్‌ను కూడా గంగూలీ సమర్థించాడు. 
 
భారత్ లేకుండా ఐసీసీకి ప్రపంచ కప్ నిర్వహించడం కష్టమని.. కానీ తాము లేకుండా వరల్డ్ కప్ నిర్వహించేందుకు ఐసీసీ సన్నద్ధమైతే.. దాన్ని ఆపగలిగే శక్తి భారత్‌కు వుందా అనేది కూడా ఆలోచించాలి. మొత్తానికి  గట్టి సందేశం మాత్రం పంపాలనేది తన అభిప్రాయమని గంగూలీ తెలిపాడు. 
 
అలాగే పాకిస్థాన్‌ను క్రీడల నుంచి పక్కనబెట్టేయాలని టీమిండియా మాజీలు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు బీసీసీఐకి అన్ని క్రికెట్ బోర్డులు మద్దతివ్వాలని మాజీ క్రికెటర్లు కోరుతున్నారు. ఈ ఏడాది మేలో జరిగే ఐసీసీ ప్రపంచకప్‌లో భారత్, పాకిస్థాన్‌తో క్రికెట్ ఆడొద్దని నెటిజన్లు కూడా డిమాండ్ చేస్తున్నారు. 
 
కానీ టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మాత్రం ప్రపంచకప్‌ నుంచి పాకిస్థాన్‌ను బహిష్కరించడం భారత్‌కు సాధ్యం కాదన్నాడు. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో భారత్‌ ఆడాలి. అలా ఆడి ఆ జట్టును మట్టికరిపించాలి. మనం ప్రపంచ కప్‌ను బహిష్కరిస్తే.. భారత్‌కే నష్టం. ప్రపంచ కప్ నుంచి పాకిస్థాన్‌ను బహిష్కరించలేం. ఇతర దేశాలు బహిష్కరణకు అంగీకరించకపోవచ్చు. పాక్‌ను బహిష్కరించే హక్కు భారత్‌కు లేదని గవాస్కర్ వ్యాఖ్యానించాడు.