శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 నవంబరు 2020 (10:29 IST)

ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియా.. ఎపుడు?

భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటన కోసం వెళ్లింది. ఆతిథ్య జట్టుతో వన్డేలు, టీ20లతో పాటు.. మూడు టెస్ట్ మ్యాచ్‌లను ఆడనుంది. ప్రస్తుతం సిడ్నీ నగరంలో బస చేస్తున్న భారత క్రికెట్ జట్టు సభ్యులు 14 రోజుల క్వారంటైన్‌లో ఉన్నారు. ఇదిలావుంటే వచ్చే యేడాది టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. 
 
ఆగస్టు - సెప్టెంబర్‌ 2021లో టీమిండియా, ఇంగ్లండ్‌ మధ్య జరిగే ఐదు టెస్టుల సిరీస్‌ తేదీలను వేదికలతో సహా ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) తాజాగా ప్రకటించింది. 2018 ఆగస్టులో ఈ గడ్డపై టెస్టు సిరీస్‌ ఆడిన కోహ్లి సేన మూడేళ్ల తర్వాత మళ్లీ బరిలోకి దిగనుంది. దీంతో పాటు స్వదేశంలో శ్రీలంకతో జరిగే 3 వన్డేలు... పాకిస్థాన్‌తో జరిగే 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను కూడా ఈసీబీ వెల్లడించింది.
 
కాగా, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈ యేడాది భారీగా నష్టపోయిన ఇంగ్లండ్‌ బోర్డు వచ్చే ఏడాది పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు నిర్వహించి ఆ లోటును పూడ్చుకోవాలని భావిస్తోంది. అందుకే పెద్ద సంఖ్యలో ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయించింది. అన్నింటికంటే ఎక్కువగా భారత్‌ - ఇంగ్లండ్‌ మధ్య పోరునే "సెంటర్‌ పీస్‌ ఈవెంట్‌"గా భావిస్తూ ఎక్కువ ఆదాయాన్ని ఈసీబీ ఆశిస్తోంది. 
 
భారత్, ఇంగ్లండ్‌ మధ్య నాటింగ్‌హామ్‌లో తొలి టెస్టు (ఆగస్టు 4-8), లార్డ్స్‌లో రెండో టెస్టు (ఆగస్టు 12-16), లీడ్స్‌లో మూడో టెస్టు (ఆగస్టు 25-29), ఓవల్‌లో నాలుగో టెస్టు (సెప్టెంబర్‌ 2-6), మాంచెస్టర్‌లో ఐదో టెస్టు (సెప్టెంబర్‌ 10-14) జరుగుతాయి. 
 
అంతేకాకుండా, ఇంగ్లండ్ క్రికెట్ జట్టు చారిత్రాత్మక పర్యటనకు శ్రీకారం చుట్టనుంది. 16 ఏళ్ల విరామం తర్వాత పాకిస్థాన్‌ గడ్డపై క్రికెట్‌ ఆడనుంది. వచ్చే ఏడాది అక్టోబర్‌ 14, 15 తేదీల్లో పాక్‌తో (కరాచీ వేదిక) రెండు టి20ల్లో ఇంగ్లండ్‌ తలపడుతుంది. ఈ సిరీస్‌ అనంతరం రెండు జట్లు కలిసి భారత్‌లో జరిగే టి20 ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకు వస్తాయి. 2005లో చివరిసారి ఇంగ్లండ్‌ జట్టు 3 టెస్టులు, 5 వన్డేల కోసం పాకిస్థాన్‌లో పర్యటించింది.