శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 8 జనవరి 2018 (16:18 IST)

రసవత్తరంగా కేప్‌టౌన్ టెస్ట్ .. భారత్ లక్ష్యం 208 రన్స్

సౌతాఫ్రికా గడ్డపై పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టుకు ఓ అరుదైన విజయం కళ్ళముందు కనిపిస్తోంది. కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ముంగిట 208 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది.

సౌతాఫ్రికా గడ్డపై పర్యటిస్తున్న భారత క్రికెట్ జట్టుకు ఓ అరుదైన విజయం కళ్ళముందు కనిపిస్తోంది. కేప్‌టౌన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ముంగిట 208 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 130 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ విజయ లక్ష్యంగా 208 పరుగులుగా ఖరారైంది. 
 
కాగా, ఈ టెస్టులో 2 వికెట్లకు 65 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సౌతాఫ్రికా మరో 65 పరుగుల తేడాలో 8 వికెట్లు కోల్పోయింది. నాలుగో రోజు తొలి సెషన్‌లో సఫారీలు వరుసగా వికెట్లు కోల్పోయారు. భారత బౌలర్లు షమి, బుమ్రా చెలరేగి మూడేసి వికెట్లు తీయగా, పాండ్యా, భువనేశ్వర్‌లు తలా రెండేసి వికెట్లు పడగొట్టారు. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో సఫారీ జట్టు 130 రన్స్‌కే చాపచుట్టేసింది. 
 
మాజీ కెప్టెన్ డివిలియర్స్ మాత్రమే 35 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మార్క్రాం (34), ఎల్గర్ (25), ఆమ్లా (4), డుప్లెస్సి (0), డీకాక్ (8), ఫిలాండర్ (0) ఇలా ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. అయితే కాలి గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమైన స్టెయిన్.. చివర్లో బ్యాటింగ్‌కు రావడం కొసమెరుపు. 
 
అయితే, భారత్ ముంగిట కనిపిస్తున్న లక్ష్యం చిన్నదే అయినప్పటికీ పిచ్ మాత్రం పూర్తిగా బౌలింగ్‌కు అనుకూలిస్తోంది. దీంతో ఈ లక్ష్యాన్ని చేరుకోవడం అంత సులభమైన విషయం కాదనీ సీనియర్ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అయితే, కోహ్లి సేన ఈ టార్గెట్‌ను చేజ్ చేస్తే మాత్రం చరిత్ర సృష్టించినట్టే. 
 
సంక్షిప్త స్కోర్లు 
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 286
భారత్ తొలి ఇన్నింగ్స్ 209
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 130
భారత్ విజయలక్ష్యం 208