శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 అక్టోబరు 2019 (10:12 IST)

భారత్ - సౌతాఫ్రికా రెండో టెస్ట్ : కోహ్లీ సేన బ్యాటింగ్

భారత్ - సౌతాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ గురువారం నుంచి ప్రారంభమైంది. విశాఖ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో విజయం సాధించిన కోహ్లీ సేన.. రెండో టెస్టులో కూడా విజయం సాధించాలన్నపట్టుదలతో ఉంది. ఇందులోభాగంగా, టాస్ గెలిచిన కెప్టెన్ కోహ్లీ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మ్యాచ్‌ జరిగే కొద్ది పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో బ్యాటింగ్‌ వైపే మొగ్గు చూపాడు. 
 
అయితే ఈ మ్యాచ్‌కు తెలుగు కుర్రాడు హనుమ విహారి అనూహ్యంగా దూరమయ్యాడు. అతడి స్థానంలో ఉమేశ్‌ యాదవ్‌ను తుదిజట్టులోకి తీసుకున్నారు. దక్షిణాఫ్రికా కూడా ఒక్క మార్పుతో బరలోకి దిగుతోంది. తొలి టెస్టులో ఏమాత్రం ఆకట్టుకోలేని ఆఫ్‌స్పిన్నర్‌ పీట్‌ను పక్కకు పెట్టి పేసర్‌ అన్రిచ్ నార్ట్జేను తుది జట్టులోకి తీసుకున్నారు. 
 
ఇకపోతే, రెండో టెస్టు ఎంపికలోనూ రిషభ్‌ పంత్‌కు నిరాశే ఎదురైంది. తొలి టెస్టులో అంతగా ఆకట్టుకోని సాహాకు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ మరో అవకాశం కల్పించింది. అయితే సాహా విఫలమవ్వడంతో తనను ఎంపిక చేస్తారని భావించిన పంత్‌కు నిరాశే మిగిలింది. ఇక హనుమ విహారిని పక్కకు పెట్టడానికి గల కారణాలను టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తెలపలేదు. 
 
అలాగే, తొలి టెస్టులో దుమ్ము దులిపిన ఓపెనర్‌ రోహిత్‌ శర్మపై అందరి దృష్టి ఉంది. ఇక ఈ టెస్టులోనే అతడు అదరగొడి​తే టెస్టుల్లో ఓపెనర్‌గా సెటిల్‌ అయినట్టేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక కెప్టెన్‌గా కోహ్లికి 50వ టెస్టు కావడంతో విశేషం. నేటి నుంచి జరిగే పోరులో పైచేయి సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని కోహ్లి సేన భావిస్తోంది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో గట్టి పోటీ ఇవ్వాలన్న పట్టుదలతో సౌతాఫ్రికా ఉంది. 
 
ఇరు జట్ల వివరాలు...
భారత్ : విరాట్‌ కోహ్లి (కెప్టెన్), రోహిత్, మయాంక్, పుజారా, రహానే, సాహా, జడేజా, అశ్విన్, ఇషాంత్, షమీ, ఉమేశ్‌ యాదవ్‌
దక్షిణాఫ్రికా : డు ప్లెసిస్‌ (కెప్టెన్‌), ఎల్గర్, మార్క్‌రమ్, డి బ్రూయిన్, బవుమా, డి కాక్, ఫిలాండర్, రబడ, అన్రిచ్ నార్ట్జే , ముత్తుసామి, మహరాజ్‌.