శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 4 సెప్టెంబరు 2017 (14:54 IST)

ఐపీఎల్ మీడియా హక్కులు రూ.16 వేల కోట్లు.. ఎవరికి సొంతం?

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ మీడియా రైట్స్ వేలం పాట చివరి క్షణం వరకు అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఈ పాటలో ఐపీఎల్ హక్కులు రికార్డు స్థాయి ధర పలికింది

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీ మీడియా రైట్స్ వేలం పాట చివరి క్షణం వరకు అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఈ పాటలో ఐపీఎల్ హక్కులు రికార్డు స్థాయి ధర పలికింది. వ‌చ్చే ఐదేళ్ల కాలానికిగాను (2018-22) స్టార్ ఇండియా ఈ హ‌క్కుల‌ను సొంతం చేసుకుంది. దీంతో బీసీసీఐకి కాసుల పంట పడినట్టయింది. 
 
టీవీ బ్రాడ్‌కాస్టింగ్స్‌తో పాటు డిజిట‌ల్ (ఇంట‌ర్నెట్‌, మొబైల్‌) హ‌క్కులను కూడా కలిపి రూ.16,347.50 కోట్ల‌కు స్టార్ ద‌క్కించుకుంది. స్వదేశంతో పాటు భారత ఉప‌ఖండం, ప్ర‌పంచ హ‌క్కుల‌ను కూడా స్టార్ ఇండియానే సొంతం చేసుకోవ‌డం విశేషం. ఈ విష‌యంలో చివ‌రివ‌ర‌కు స్టార్‌కు సోనీ నెట్‌వ‌ర్క్‌ గ‌ట్టి పోటీ ఇచ్చింది. అయితే, ఇతర సంస్థల కంటే స్టార్ టీవీ అత్య‌ధిక మొత్తంలో బిడ్ దాఖ‌లు చేయడంతో ఈ హక్కులను సొంతం చేసుకుంది. 
 
తొలి ప‌దేళ్ల‌కుగాను బ్రాడ్‌కాస్టింగ్ రైట్స్ కోసం 2008లో సోనీ రూ.8200 కోట్లు చెల్లించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడే ఐదేళ్ల‌కే దానికి రెట్టింపు మొత్తాన్ని బీసీసీఐకి స్టార్ టీవీ యాజమాన్యం చెల్లించ‌నుంది. అయితే బ్రాడ్‌కాస్టింగ్‌తోపాటు డిజిట‌ల్ హక్కులు కూడా ఇందులో ఇమిడివున్నాయి.