గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 23 మార్చి 2019 (16:49 IST)

మిస్టర్ కోహ్లీ.. వరల్డ్‌ కప్‌ను గెలవడం అంత ఈజీ కాదు : ద్రవిడ్ హెచ్చరిక (video)

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ సుతిమెత్తని హెచ్చరిక చేశారు. అదీకూడా ఐసీసీ ప్రపంచ కప్ 2019కు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ద్రవిడ్ హెచ్చరించాడు. వచ్చే ప్రపంచ కప్‌ను గెలవడం అంత సులభం కాదని ఆయన తేల్చిచెప్పారు.
 
గత రెండు సంవత్సరాలుగా టీమిండియా మంచి దూకుడుమీద ఉంది. కానీ, ఇటీవల సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన ట్వంటీ-20, వన్డే సిరీస్‌లలో కోహ్లీ సేన చిత్తుగా ఓడిపోయింది. విదేశీ గడ్డలపై విజయభేరీ మోగించి చరిత్రను తిరగరాసిన భారత్... ప్రపంచ కప్ టోర్నీకి ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఓడిపోవడం సగట భారతీయ క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేక పోయాడు. 
 
ఈ నేపథ్యంలో కోహ్లీకి రాహుల్ ద్రవిడ్ ఓ సుతిమెత్తని హెచ్చరిక చేశాడు. ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమితో భారత్ క్రికెట్ జట్టు ఇంగ్లండ్ వేదికగా జరిగే ప్రపంచ కప్‌ టోర్నీలో ఎంతమేరకు రాణిస్తుందో చెప్పలేమన్నారు. 
 
"వరల్డ్ కప్ గెలుచుకోవడం భారత్‌కు అంత ఈజీ కాదనిపిస్తోంది. ఆస్ట్రేలియాతో మనం 2-3తేడాతో వన్డే సిరీస్ ఓడిపోయాం. ఇది మంచి పరిణామమే అనిపిస్తోంది. ప్రపంచ కప్ టోర్నీకి మనమింకా ఎంత సన్నద్ధమవ్వాలో తెలియజేసింది. దీన్నిబట్టి టోర్నీలో భారత్.. ప్రతి జట్టుతో చాలా టఫ్‌ కాంపిటీషన్ ఎదుర్కొంటుందని చెప్పొచ్చు. రెండేళ్లుగా భారత్ చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది" అని చెప్పారు .
 
'వన్డే క్రికెట్‌లో రెండేళ్లుగా భారత్ నెం.1గా రాణిస్తోంది. అలా చూస్తే మనకు వరల్డ్ కప్ గెలవడం చాలా సులువైన పనే. కానీ, ఇటీవల ముగిసిన సిరీస్‌ను బట్టి చూస్తే టీమిండియా చాలా గట్టిపోటీని ఎదుర్కొంటుందని అనిపిస్తోంది' అని రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు.