బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. క్రికెట్ ప్రపంచ కప్ 2019
Written By
Last Updated : ఆదివారం, 9 జూన్ 2019 (19:02 IST)

ఆస్ట్రేలియా బౌలర్లకు ముచ్చెమటలు - ధవాన్ సెంచరీ... భారత్ భారీ స్కోరు

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోరు చేసింది.  
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన కెప్టెన్ విరాట్ కోహ్ల బ్యాటింగ్ ఎంచుకోవడంతో ఓపెనర్లుగా క్రీజ్‌లోకి వచ్చిన రోహిత్ శర్మ, శిఖర ధవాన్‌లు ఆరభంలో ఆచితూచి ఆడారు. ఆ తర్వాత బ్యాట్‌కు పని చెప్పారు. ఈ క్రమంలో వీరిద్దరూ అర్థసెంచరీలు సాధించారు. 
 
21.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 124 పరుగులు చేసింది. రోహిత్ 70 బంతులు ఎదుర్కొని ఓ సిక్సర్, మూడు ఫోర్ల సాయంతో 57 పరుగులు చేసి, కౌల్టర్ నైల్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు. ఆ తర్వాత కోహ్లీ సాయంతో ధవాన్ రెచ్చిపోయాడు. 95 బంతులు ఎదుర్కొని 13 ఫోర్ల సాయంతో సెంచరీ చేయగా, మొత్తం 109 బంతుల్లో 19 ఫోర్ల సాయంతో 117 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇది శిఖర్ ధవాన్‌కు మూడో ప్రపంచ కప్ సెంచరీ కావడం గమనార్హం. గతంలో సౌతాఫ్రికా, ఐర్లాండ్ జట్లపై సెంచరీ బాదాడు. ధవాన్ వన్డే కెరీర్‌లో17వ సెంచరీ.  
 
అప్పటికి భారత్ స్కోరు 36.2 ఓవర్లలో 220 పరుగులు చేసింది. ధవాన్ ఔట్ కావడంతో నాలుగో డౌన్‌లో ప్యాండ్యాను బ్యాటింగ్‌కు పంపించారు. పాండ్యా బ్యాట్‌ను ఝుళిపించడంతో స్కోరు బోర్డు పరుగులు తీసింది. 27 బంతులు ఎదుర్కొన్న పాండ్య 3 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో 48 పరుగులు చేసి తృటిలో అర్థ సెంచరీని మిస్ చేసుకున్నాడు. దీంతో భారత్ తన మూడో వికెట్‌ను 301 పరుగుల వద్ద కోల్పోయింది. 
 
ఆతర్వాత ధోనీ - కోహ్లీని స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ధోనీ 14 బంతుల్లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 27 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన కేఎల్ రాహుల్ కూడా వచ్చీ రావడంతోనే బ్యాట్‌కు పని చెప్పాడు. ఫలితంగా మూడు బంతుల్లో ఓ సిక్సర్, ఓ ఫోర్ బాది 11 పరుగులు చేయగా, కోహ్లీ 77 బంతుల్లో 2 సిక్సర్లు, 4 ఫోర్లు కొట్టి 82 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. కోహ్లీ ఔట్ తర్వత క్రీజ్‌లోకి జాదవ్, రాహుల్‌లు నాటౌట్‌గా నిలించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో భారత్ ఐదు వికెట్ల నష్టానికి 352 పరుగులు భారీ స్కోరు చేసింది. ఆసీస్ బౌలర్లలో స్టోయిన్స్ రెండు వికెట్లు తీయగా, కుమ్మిన్స్, స్టార్క్, నైల్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ఆస్ట్రేలియా ముంగిట 353 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని ఉంచింది.