శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By tj
Last Updated : గురువారం, 7 జూన్ 2018 (11:21 IST)

కేసీఆర్‌కు ఉన్న ధైర్యం చంద్రబాబుకు లేదా..? ఎందుకని?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి రెండు రాష్ట్రాలుగా ఏర్పాటయ్యాక ప్రతి అంశంలోనూ రెండు రాష్ట్రాలనూ పోల్చడం పరిపాటిగా మారింది. పరిపాలన, అభివృద్ధి, ఆయా ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు… అన్నింటిలోనూ ఒక రాష్ట

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి రెండు రాష్ట్రాలుగా ఏర్పాటయ్యాక ప్రతి అంశంలోనూ రెండు రాష్ట్రాలనూ పోల్చడం పరిపాటిగా మారింది. పరిపాలన, అభివృద్ధి, ఆయా ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు… అన్నింటిలోనూ ఒక రాష్ట్రంతో ఇంకో రాష్ట్రాన్ని పోల్చడం సాధారణమైంది. ప్రత్యేకించి ముఖ్యమంత్రుల పనితీరునూ అదేరీతిలో పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే… స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇలాంటి పోలికతోనే చర్చ జరుగుతోంది.
 
రెండు రాష్ట్రాల్లోనూ స్థానిక సంస్థల ఎన్నికలు జులై-ఆగస్టు నెలల్లో జరగాల్సివుంది. అంటే సాధారణ ఎన్నికలకు కొన్ని నెలలు ముందుగా పంచాయతీ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ ఎన్నికలు నిర్వహించాలి. తెలంగాణలో ఈ ఎన్నికలు సకాలంలో జరుగుతాయని అంటున్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 2019 అసెంబ్లీ ఎన్నికల తరువాత మాత్రమే స్థానిక సంస్థల ఎన్నిలు నిర్వహిస్తారన్న ప్రచారం సాగుతోంది. 
 
అసెంబ్లీ ఎన్నికలకంటే ముందు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే…. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపైన, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైన ఒక అంచనాకు రావడానికి అవకాశం ఉంటుంది. అనుకూల ఫలితాలు వస్తే ఫర్వాలేదుగానీ… ప్రతికూల ఫలితాలు వస్తే అధికార పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది. సహజంగానే అధికార పార్టీపైన ఎంతోకొంత వ్యతిరేకత ఉంటుంది. తమ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలపైన నమ్మకం ఉండి, అసెంబ్లీ ఎన్నికల్లోనూ తామే గెలవగలమన్న ధైర్యం అధికార పార్టీకి ఉంటే…. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు పంచాయతీరాజ్‌ ఎన్నికలకు సిద్ధమవుతారు.
 
తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వం… తమ పాలనపై ఉన్న ధీమాతో సకాలంలో పంచాయతీరాజ్‌ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అంటే ఈ జులై-ఏప్రిల్‌ నెలల్లోనే ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సై అంటోంది. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పంచాయతీరాజ్‌ ఎన్నికలు జరగబోవని, ప్రత్యేక అధికారులను నియమిస్తారని చెబుతున్నారు.
 
ఎందుకంటే పంచాయతీలో రిజర్వేషన్లు ఖరారు చేయమని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రభుత్వానికి లేఖ రాసినా… ఆ పని ఇంకా పూర్తికాలేదు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి సిబ్బందిని కేటాయించాలని కోరినా ఇప్పటిదాకా ప్రభుత్వం పట్టించుకోలేదు. అసలు పంచాయతీరాజ్‌ ఎన్నికల గురించే ప్రభుత్వ పెద్దలు ఎవరూ మాట్లాడటం లేదు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడూ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన ఉదంతాలున్నాయి. ఇప్పుడు కూడా అదే రీతిలో వాయిదా వేస్తారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
 
తెలంగాణలో తమ ప్రభుత్వానికి అనుకూలత ఉందని, అందుకే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే పంచాయతీరాజ్‌ ఎన్నికలు నిర్వహించి, తిరుగులేని విజయాలు సాధించగలిగితే… ప్రతిపక్షాలను నైతికంగా దెబ్బతీయవచ్చన్న వ్యూహంతో కేసీఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అదే ధీమా ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుదేశం ప్రభుత్వంలో కొరవడటంతో ఎన్నిక వాయిదా గురించి ఆలోచిస్తున్నారు.