శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By శ్రీ
Last Updated : గురువారం, 26 సెప్టెంబరు 2019 (18:34 IST)

వేణుమాధ‌వ్ హాస్ప‌ిట‌ల్ బిల్లు క‌ట్టిన మంత్రి, ఇంత‌కీ ఎవ‌రా మంత్రి?

ప్ర‌ముఖ హాస్య‌న‌టుడు వేణుమాధవ్ అనారోగ్యంతో  మ‌ర‌ణించిన‌ సంగతి తెలిసిందే.  సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. వేణుమాధవ్ మృతితో టాలీవుడ్‌లో విషాదఛాయలు అలుముకోగా.. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించి.. కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
 
ఇదిలా ఉంటే.. వేణుమాధవ్ భౌతికకాయాన్ని సందర్శించిన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాళులు అర్పించారు. అంతేకాకుండా... వేణుమాధవ్ ఆస్పత్రిలో ఉన్నంతవరకూ అయిన బిల్లును మంత్రి తలసానే చెల్లించారు. అలాగే అంత్యక్రియలకు కావాల్సిన డబ్బు మొత్తం తానే సాయం చేస్తానని చెప్పి 2 లక్షలు సాయం ప్రకటించినట్లు సమాచారం. 
 
ఈ సందర్భంగా మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ మీడియాతో మాట్లాడుతూ.... వేణుమాధవ్ నాకు తమ్ముడు లాంటి వాడు. ఇంత చిన్నవయస్సులోనే మరణించడం బాధాకరం. వేణుమాధవ్‌తో చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. ఇండస్ట్రీకి రాక ముందు నుంచీ వేణుమాధవ్ నాకు తెలుసు. ఆయన ఎక్కడున్నా అందర్నీ నవ్వించేవాడు. 
 
ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని టాలెంట్‌తో ఈ స్థాయికి వ‌చ్చాడు. సుమారు 600 చిత్రాల్లో నటించి.. నంది అవార్డులు దక్కించుకున్నాడు అని చెప్పి ఒకింత భావోద్వేగానికి లోన‌య్యారు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ‌చేశారు.