బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By
Last Updated : బుధవారం, 12 జూన్ 2019 (15:38 IST)

ఆ కారణంతోనే నాకు మంత్రి పదవి రాలేదనుకుంటా.. రోజా కామెంట్స్

ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. ఇందులో 151 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ గెలుపును నమోదు చేసుకుంది. అలాగే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ 23 స్థానాలను మాత్రం సాధించుకుంది.  
 
ఈ నేపథ్యంలో మే 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే మంగళవారం మంత్రివర్గ ఏర్పాటు కోసం పార్టీ సమావేశం జరిగింది. ఇందులో ఐదు డిప్యూటీ సీఎంలను నియమించనున్నట్లు జగన్ ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు కాపులకు.. ఇలా ఐదు సామాజిక వర్గాల నుంచి ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా నియమించాలని జగన్ భావించారు. 
 
అయితే గతవారం జరిగిన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, సినీ నటి రోజా హాజరు కాలేదు. పార్టీ కోసం ఇంతగా శ్రమించిన రోజాకు మంత్రి వర్గంలో చోటు కల్పించకపోవడంపై సర్వత్రా విమర్శలు ఎదురయ్యాయి. 
 
ఇంకా రోజాను డిప్యూటీ సీఎంగా జగన్ ఎంపిక చేస్తారని కూడా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో అమరావతికి వచ్చిన రోజా మీడియాతో మాట్లాడుతూ.. కుల సమీకరణాల కారణంగానే తనకు మంత్రి పదవి రాలేదని అనుకుంటున్నానని అభిప్రాయపడ్డారు. 
 
తనకు మంత్రివర్గంలో చోటుదక్కలేదని బాధ లేదన్నారు. తాను అలిగానన్నది మీడియా ప్రచారం మాత్రమేనని అన్నారు. మంత్రుల ప్రమాణ స్వీకారానికి మంత్రులు ఉంటే సరిపోతుంది కదా.. ఎమ్మెల్యేలు ఎందుకు? అందుకే తాను ఆ కార్యక్రమానికి హాజరు కాలేదని చెప్పారు. 
 
తనకు నామినేటెడ్‌ పదవి ఇస్తానని ఎవరూ చెప్పలేదని.. అది కూడా మీడియా సృష్టేనని స్పష్టం చేశారు. ఇంకా అసెంబ్లీ సమావేశాల కోసమే విజయవాడ వచ్చానన్న రోజా.. మంత్రి పదవులు లభించిన అందరికీ శుభాకాంక్షలు చెప్పారు.