మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By Srinivas
Last Modified: బుధవారం, 11 జులై 2018 (12:36 IST)

పరిపూర్ణానందపై పోలీసులు నగర బహిష్కరణకు అసలు కారణాలేంటి?

కత్తి మహేష్‌ను నగరం నుంచి బహిష్కరించిన తెలంగాణ పోలీసులు ఇప్పుడు పరిపూర్ణానందపైన కూడా బహిష్కరణ వేటు వేశారు. అసలు పరిపూర్ణానందను బహిష్కరించడానికి గల కారణాలు ఏమిటో చూద్దాం.

కత్తి మహేష్‌ను నగరం నుంచి బహిష్కరించిన తెలంగాణ పోలీసులు ఇప్పుడు పరిపూర్ణానందపైన కూడా బహిష్కరణ వేటు వేశారు. అసలు పరిపూర్ణానందను బహిష్కరించడానికి గల కారణాలు ఏమిటో చూద్దాం.
 
 
1) నవంబర్ 2017లో మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్‌లో జరిగిన రాష్ట్రీయ హిందూ సేన ఆవిర్భావ సభలో స్వామీజీ ప్రసంగిస్తూ ముస్లింలకు, క్రైస్తవులకు మక్కా, జెరూసలెం వెళ్లేందుకు ప్రభుత్వాలు పెద్దమొత్తంలో ప్రజాధనాన్ని సబ్సిడీలుగా ఇస్తున్నాయని ప్రశ్నించారని... అలాగే  హిందువులు తమ పవిత్ర క్షేత్రాలకు వెళ్లాలంటే మాత్రం సర్‌ఛార్జీల పేరుతో పన్నులు వసూలు  చేస్తున్నారని వ్యాఖ్యానించారని పోలీసులు తెలిపారు. ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని  పోలీసులు తమ రిపోర్టులో తెలిపారు.
 
2) అలాగే 2 డిసెంబర్ 2017లో రామేశ్వరపల్లి గ్రామం, కామారెడ్డి జిల్లాలోనూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని పోలీసుల  ఆరోపణలు చేశారు. ఈ సమావేశంలో మీకు నిజాం పాలన కావాలా? లేక ఛత్రపతి శివాజీ పాలన కావాలా అంటూ స్వామీజీ యువతను ప్రశ్నించడంపై పోలీసులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మొగల్ పాలకులు బాబర్, గజనీ మహమ్మద్, ఖిల్జీ, హుమాయున్ వంటి వారు దేశంలో హిందువులపై ఎన్నో అరాచకాలు చేశారని, అత్యాచారాలు, లూటీలు చేశారని ఎంతోమంది  హిందువులను ముస్లిం పాలకులు చంపివేశారని స్వామీజీ తన ప్రసంగంలో పేర్కొన్నారని... ఇవి అభ్యంతరకరంగా ఉన్నాయని అన్నారు. అలాగే ఈ తెలంగాణ భూమిలోనూ రజాకర్లు ఎన్నో ఘోరాలు చేశారని... ప్రజలపై ముఖ్యంగా హిందూ మహిళలపై దమనకాండను కొనసాగించారని అన్నారన్నారని... ఇవి కూడా తమకు అభ్యంతరకరంగా ఉన్నాయని పోలీసులు తెలిపారు.
 
 
3) స్వామీజీ తెలంగాణలోని ప్రాంతాలు పట్టణాల పేర్లను సైతం మార్చాల్సిన అవసరం ఉందని పోలీసులు మరో అభ్యంతరం.  నిజామాబాద్, హైదరాబాద్, సికింద్రాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ పేర్లను మార్చాలన్నారు. నిజామాబాద్ పేరును దాని పూర్వనామం ఇందూరుగా పేరు మార్చాలని అన్నారని పోలీసులు చెప్పుకొచ్చారు. అటు 11 మార్చి 2018లో కరీంనగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలోనూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. 
 
స్వామీజీ చేసిన ఈ అభ్యంతరకర వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలంటూ జూబ్లీ హిల్స్ పోలీసులు స్వామీజీకి జూలై 9వ తేదీన షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే స్వామీజీకి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని వారి లీగల్ అడ్వైజర్  వాదన. నోటీసులు ఇచ్చిన 24 గంటల తర్వాత కూడా స్వామీజీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని అందుకే వారిని ఆరు నెలలపాటు హైదరాబాద్ నగరంలో ప్రవేశించకుండా బంజారాహిల్స్ ఏసీపీ నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏసీపీ ఆజ్ఞాల మేరకు ఈ రోజున తెల్లవారు జామున స్వామీజీని అదుపులోకి తీసుకుని గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు. ఆరు నెలల తర్వాత స్వామీజీ హైదరాబాద్‌లో ప్రవేశించాలంటే కూడా ఆంక్షలు వున్నట్లు పోలీసులు తెలిపారు.
 
అంతేకాదు ఇకపై స్వామీజీ హైదరాబాద్ నగరంలో ప్రవేశించాలంటే ముందుగా ఇన్పెక్టర్ ఆఫ్ పోలీసు అనుమతి తీసుకోవాలని, అలాగే తాను నివశించే చిరునామా తెలుపాలని, అలాగే తాను ఎంతకాలం అక్కడ నివాసం ఉంటున్నారో కూడా తెలుపాలని ఆంక్షలు విధించినట్లు చెప్పారు. పోలీసులు విధించిన ఈ ఆంక్షలపై 15 రోజుల్లో స్వామీజీ ట్రిబ్యూనల్‌కు వెళ్లవచ్చనని కూడా పోలీసులు తెలియజేశినట్టు సమాచారం.