గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By
Last Updated : సోమవారం, 25 మార్చి 2019 (12:31 IST)

ఏపీకి కాబోయే సీఎంను నేనే.. తొలి సంతకం ఆ ఫైలుపైనే చేస్తా: పవన్

ఏపీకి తానే కాబోయే సీఎం అని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. విజయవాడలో చేపట్టిన ప్రచారంలో భాగంగా ఎన్నికల తర్వాత తానే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని పునరుద్ఘాటించారు.


పులివెందుల నుంచి వచ్చిన జగన్, కుప్పం నుంచి వచ్చిన చంద్రబాబు కుటుంబాలే రాష్ట్రాన్ని ఏలాలా? మిగిలినవారు రాజకీయాలకు పనికిరారా? అని పవన్ ప్రశ్నించారు. విజయవాడలో రౌడీలు, గూండాల అరాచకాలు పెరిగిపోయాయని, అధికారంలోని రాగానే వారి తాట తీస్తానని హెచ్చరించారు. రాష్ట్రంలో భూకబ్జాలకు పాల్పడే వారిని వదిలిపెట్టేది లేదన్నారు. 
 
అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లాలోని కైకలూరు, బంటుమిల్లి, మచిలీపట్నం, అవనిగడ్డలలో పర్యటించిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఓటర్లపై వరాల జల్లు కురిపించారు. తాను అధికారంలోకి వస్తే 60 ఏళ్లు నిండిన ప్రతీ రైతుకు నెలకు రూ.5 వేల పింఛను ఇస్తానని, సీఎం అయితే తన తొలి సంతకం ఆ ఫైలు మీదేనని పేర్కొన్నారు.
 
నాణ్యమైన సరుకులు కొనుగోలు చేసేందుకు ప్రతీ ఆడపడుచుకు రూ. 2500 నుంచి రూ.3500 ఇస్తానని, తన రెండో సంతకం ఈ ఫైలు మీదేనని పవన్ హామీ ఇచ్చారు. యువతకు మూడు లక్షల ఉద్యోగాలు కల్పించే ఫైల్‌పై మూడో సంతకం చేస్తానని స్పష్టం చేశారు.  
  
అలాగే ప్రత్యేక హోదాపై ధైర్యంగా పోరాడిన ఏకైక పార్టీ జనసేన అని పవన్ నొక్కి చెప్పారు. విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీసే ధైర్యం వైఎస్ జగన్‌కు లేదని విమర్శించారు. వైసీపీకి ఓటేసి రాష్ట్రాన్ని కేసీఆర్ చేతుల్లో పెట్టొద్దని సూచించారు. కేసీఆర్, జగన్ మధ్య అవగాహన ఒప్పందం ఉన్నందునే వైసీపీ తెలంగాణలో పోటీ చేయడం లేదని పవన్ అభిప్రాయపడ్డారు. 
 
ఒకే సిద్ధాంతానికి కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న కేసీఆర్‌ అంటే తనకెంతో అభిమానమని, అయితే ఒకే ఒక్క సంతకంతో ఏపీకి చెందిన బీసీలను ఓసీలుగా మార్చేయడం మాత్రం తనను బాధించిందన్నారు. ఈ అంశంపై కేసీఆర్‌ను జగన్ ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు.