మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Modified: మంగళవారం, 16 జులై 2019 (17:34 IST)

ఆ సేవలపై ఉన్నట్లుండి ఎందుకిలాంటి నిర్ణయం తీసుకున్నారు తిరుమలేశా?

తిరుమల శ్రీవారి బ్రేక్ దర్సనం టిక్కెట్లు వివాదం రోజురోజుకు ముదురుతోంది. బ్రేక్‌లు ఉండవని.. ఇప్పటికే టిటిడి ఛైర్మన్ ప్రకటించారు. ఇది ఎంతవరకు సాధ్యం. ఎల్1, ఎల్2, ఎల్3 దర్సనాలను మాత్రమే రద్దు చేసి అందరికీ సమానంగా బ్రేక్ దర్సనాల టిక్కెట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గతంలో బ్రేక్ దర్సనాలను ఇలా విభజించిన దాఖలాలు లేవు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జెఈఓగా వచ్చిన శ్రీనివాసరాజు ఒకే టిక్కెట్టు ధర పొందిన భక్తులను విడివిడిగా విభజించి పాలించాడు. దీని పర్యావసారమే ఇప్పుడు అందరూ ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది. 
 
వైసిపి అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమల దర్శనాలకు సంబంధించిన సమస్యలను ప్రక్షాళన చేయాలన్న దిశగా నడుం బిగించింది. దీనిలో భాగంగానే ఎల్1, ఎల్2, ఎల్3 దర్సనాలను రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తిరుమలలో రెండుసార్లు పనిచేసి మంచి అనుభవం ఉన్న వ్యక్తిగా ధర్మారెడ్డిని కేంద్ర సర్వీసుల నుంచి తీసుకొచ్చి తిరుమల జెఈఓ విధులను ఆయనకు అప్పగించింది. ధర్మారెడ్డి హయాంలో సామాన్య భక్తులకు పెద్దపీట వేశారు. 
 
విఐపిలకు కూడా ఎలాంటి లోటులేకుండా చర్యలు చేపట్టారు. అనుభవం ఉన్న వ్యక్తులను తీసుకొస్తే తిరుమలలో కొంతవరకు ప్రక్షాళన చేయగలుగుతామని భావించిన ప్రభుత్వం ధర్మారెడ్డిని నియమించింది. ఉమేష్ చంద్ర అనే వ్యక్తి బ్రేక్ దర్శనాలు రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. 
దీనిపై కోర్టు టిటిడిపై అక్షింతలు వేసింది. వెంటనే దర్శన విధివిధానాలపై నివేదిక ఇవ్వాలని కోరింది. ఈ నెల 19న కోర్టు తీర్పు వెలువడకముందే ప్రస్తుత చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి ఎల్1, ఎల్2, ఎల్3 దర్సనాలపై ఓ నిర్ణయానికి వచ్చారు. ఎల్1, ఎల్2, ఎల్3లను రద్దు చేయాలని నిర్ణయించారు. ఇది సాధ్యమా... పాలకమండలి పూర్తిస్థాయిలో ఏర్పాటు కాలేదు. ఈ నేపథ్యంలో వీరు తీసుకునే నిర్ణయం అమలవుతుందా..? అనేది మరో రెండు రోజుల వరకు వేచి చూడాలి. కోర్టు తీర్పు రానున్న నేపథ్యంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తన నిర్ణయాన్ని ఏవిధంగా కోర్టుకు వివరణ ఇవ్వనున్నారు...? 
 
బ్రేక్ దర్శనాలు రద్దు చేసే ధైర్యం ప్రభుత్వానికి ఉందా..? రద్దు చేస్తే ప్రోటోకాల్ పరిధిలోకి వచ్చే వివిఐపిలకు ఎలా దర్శనం కల్పిస్తారు? విచక్షణ కోటాలో ఇప్పటికే రెవిన్యూ, పోలీసులు, పొలిటికల్, న్యాయవ్యవస్థ, ప్రెస్, అన్ని శాఖలకు సంబంధించి టికెట్లు మంజూరు చేస్తున్నారు. దర్శనాలను రద్దు చేస్తే మరి వీరి పరిస్థితి ఏంటి..? దర్శన విధివిధానాలను మారుస్తారా..? లేక ఎల్1, ఎల్2, ఎల్3 దర్సనాలను మాత్రం తీసివేసి బ్రేక్ దర్సనాలను కొనసాగిస్తారా..? బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తే ఇటు రాజకీయ పరంగానూ ఇబ్బందులు ఎదుర్కోవాలి. 
 
ఎల్1 పేరుతో హారతి ఇస్తున్నారు.. ఒకే టికెట్ ధరపై 500 విడివిడిగా దర్శనం కల్పించడంపై కోర్టు కూడా ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. దీంతో టిటిడి ఎల్1, ఎల్2, ఎల్3 దర్సనాలకు స్వస్తి పలకాల్సిన పరిస్థితి. ఇది రద్దు చేస్తే... బ్రేక్ దర్శనాలు ఏవిధంగా ఉండబోతున్నాయి అనేది అందరూ చర్చించుకుంటున్నారు. గత ఎనిమిదేళ్ల క్రితం బ్రేక్ టికెట్లు ఏవిధంగా మంజూరు చేశారో అదేవిధంగానే మంజూరు చేయాలని ప్రోటోకాల్ వీఐపీలకు ప్రత్యేకంగా దర్శనాలు ఏర్పాటు చేయాలన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి తితిదే ఏం చేస్తుందో వేచి చూడాల్సిందే.