శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By జె
Last Updated : శుక్రవారం, 22 ఫిబ్రవరి 2019 (08:12 IST)

ఆ ముగ్గురు చేస్తున్న కుట్రలు… బాబుగారు ఒక్కరే చేశారా.. ఏంటది..!

తెలుగుదేశం పార్టీ నుంచి ఆమంచి కృష్ణమోహన్‌, అవంతి శ్రీనివాస్‌లు వైసిపిలో చేరడంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగామారాయి. తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని తేలిపోవడంతోనే మోడీ, కేసీఆర్‌, జగన్‌ ముగ్గూరూ కలిసి కుట్రలు చేస్తున్నారని, పార్టీ నాయకులనులాగే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
 
ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరడం, ఈ క్షణందాకా ఒక పార్టీలో ఉంటూ మరుక్షణంలో ఇంకో పార్టీలో చేరడం, ఏ పార్టీ టికెట్టు ఇస్తే ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవడం, ఇవన్నీ రాజకీయాల్లో దిగజారిన నైతిక విలువలకు నిదర్శనమే. కుట్రలు చేసి తమ పార్టీ నాయకులను లాక్కుంటున్నారని ఆక్రోశిస్తున్న చంద్రబాబు నాయుడు... వైసిపిలో గెలిచిన 23 మంది ఎంఎల్‌ను టిడిపిలో ఏ విధంగా చేర్చుకున్నారు. 
 
వైసిపి నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు ఎలా కట్టబెట్టారు? మోడీ, కెసిఆర్‌, జగన్‌ ఈ ముగ్గురూ కలిసి చేస్తున్న కుట్రలను చంద్రబాబు నాయుడు ఒక్కరే చేశారని అనుకోవాలా? ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా ప్రస్తావించాలి. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో…. పార్టీలు మారిన నాయకులను ఓడించండి అని పిలుపునిచ్చారు. అదేమాటను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో చెప్పగలరా?
 
ఆమంచి కృష్ణమోహన్‌, అవంతి శ్రీనివాస్‌ నిర్దిష్టమైన ఆరోపణలు చేశారు. చంద్రబాబు నాయుడు తన కులానికి చెందిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ తన కులానికి చెందిన వారితోనే నింపేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు చెప్పదలచుకుంటే… ఈ ఆరోపణలకు వివరణ ఇవ్వాలి. అంతేగానీ వాటిని పక్కనపెట్టి, ఆ ముగ్గురూ కుట్రలు చేస్తున్నారంటూ మాట్లాడటం వల్ల టిడిపిపైన వచ్చిన ఆరోపణలు సమసిపోవు. ఇప్పటికైనా చంద్రబాబు తనపై పడుతున్న కులపిచ్చి ముద్రను తెలగించుంటారా?!
 
మరో అంశం…. సినీనటుడు శివాజీ ఢిల్లీలో మతిలేకుండా ఏదో మాట్లాడారు. ఆ మాటలనే చంద్రబాబు అందిపుచ్చుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. జగన్‌ ఏమి చదువుకున్నాడో తెలియదట. చదువుకోని వాళ్లు రాష్ట్రాన్ని ఎలా పాలించగలరు… అని శివాజీ చెప్పిన మాటనే 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు కూడా చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. జగన్‌ ఏమి చదువుకున్నాడో ఇప్పటిదాకా జరిగిన ఎన్నికల్లో ఆయన సమర్పించిన అఫిడవిట్‌ చూస్తూ తెలిసిపోతుంది. అయినా, రాజకీయాల్లో ఉండటానికి చదువుతో సంబంధం లేదు. 
 
ఉన్నత చదువులు చదివినవారే పదవులు చేపట్టాలంటే…. చంద్రబాబు కంటే ఎక్కువ చదివిన వాళ్లు, లోకేష్‌ బాబుకంటే ఉన్నత చదువులు అభ్యసించిన వాళ్లు లక్షల మంది ఉంటారు. ముఖ్యమంత్రి పదవికి, మంత్రి పదవికి వాళ్లే అర్హులవుతారు. అందుకే అది అర్థం లేని వాదన.
 
రాజకీయాల్లో హుందాగా ఉంటానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు… ఇటీవల కాలంలో తనకు తానుగా ప్రతిష్టను దిగజార్చుకుంటున్నారు. రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఎత్తులు, వ్యూహాలు మామూలేగానీ… మరీ అసంబద్ధంగానూ, అర్థంలేని విధంగానూ ఉండకూడదు. దీన్ని చంద్రబాబు గుర్తించాల్సిన అవసరం ఉందంటున్నారు విశ్లేషకులు.