శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (19:10 IST)

శ్రీకృష్ణాష్టమి వ్రతం ఆచరిస్తే కలిగే ఫలితాలేంటో తెలుసా?

శ్రీకృష్ణుడు జన్మించిన రోజునే గోకులాష్టమి, జన్మాష్టమి అని కూడా అంటారు. ఈ పండుగను శ్రావణ బహుళ అష్టమినాడు చేసుకుంటారు. కొంతమంది కృష్ణుడు పుట్టినప్పుడు ఉన్న రోహిణి నక్షత్రం ఉన్న రోజున జరుపుకుంటారు. శ్రావణ బహుళ అష్టమి, రోహిణి నక్షత్రం, అర్థరాత్రి కారాగారంలో దేవకీ వసుదేవుల దంపతులకు శ్రీమన్నారాయణుడు కన్నబిడ్డగా పుట్టాడు. దేవకీ వసుదేవుల హృదయంలో అవధులు లేని అనందసాగరం, ఆ జగన్నాట సూత్రదారే తమకు పుత్రునిగా జన్మించినందుకు తమ జన్మ సార్థకమైందని అమిత ఆనందం పొందుతారు.
 
బాలకృష్ణుడు బాల్యంలో అందరి ఇళ్ళల్లోకి తన స్నేహితులతో వెళ్లి తనకిష్టమైన పాలు, పెరుగు, వెన్న దొంగిలించేవాడు. తను తిని అందరికీ పెట్టేవాడు. ఆ కృష్ణపరమాత్మ తన స్నేహితులను నేలమీద ఒకరి వీపుపై ఒకరిని పడుకోబెట్టి అప్పుడు వెన్న, పెరుగులకోసం ఉట్టీలను అందుకొనేవాడు. ఆ కృష్ణలీలను గుర్తుచేసుకుంటూ జరుపుకునే సంబరమే ఉట్టీలు కొట్టడం.
 
పరిశుద్ధ ప్రదేశమున మండపాన్ని ఏర్పరచి, దానిపై కలశమును స్థాపించి, అందు దేవకీ వసుదేవులను, గోవులను, గోపికలను ఆవాహన చేస్తారు. శ్రీకృష్ణ ప్రతిమను లేదా పటాన్ని ఉంచి షోడశోపచారములతో భక్తిగా అర్చిస్తారు. నేలను అలికి, స్వస్తిక్ ఆకారపు ముగ్గువేసి, ఆ స్థలాన్ని బాగా అలంకరిస్తారు. పండ్లు, పిండి పదార్థాలు లడ్డూలు, మోదకములు, పాలతో వండిన పదార్థాలతో నెయ్యి, పాలు, తేనె, బెల్లంతో కూడిన నైవేద్యమును ‘ఓ శ్రీహరీ నీవు స్వీకరింతువుగాక’ అని నివేదిస్తారు. 
 
తరువాత పచ్చకర్పూరం, యాలకులు, లవంగాలు, జాజి, జాపత్రి మొదలైన సుగంధ ద్రవ్యాలతో కూడిన తాంబూలమును స్వామికి సమర్పిస్తారు. అనంతరం స్వామికి కర్పూర నీరాజనాన్ని, నమస్కారాన్ని సమర్పిస్తారు. ముల్లోకాల్లో ఇటువంటి కృష్ణాష్టమీ వ్రతం ఇంకొకటి లేదు. ఈ వ్రతాన్ని ఆచరించినవారికి కోటి ఏకాదశీ వ్రత ఫలం లభిస్తుంది. ఈ అష్టమిని పురస్కరించుకొని ఉపవాసం చేస్తారు. ఈ వ్రతాన్ని చేసినవారు సప్తజన్మల పాపం నుంచి విముక్తులవుతారని ప్రగాఢ విశ్వాసం.
 
శ్రీకృష్ణాష్టమినాడు జనులు తమ ఇళ్ళను శుభ్రపరచి, తోరణాలతో అలంకరించడమేకాక ఇంటి ముంగిళ్ళలో బాలకృష్ణుని పాదముద్రలను వేస్తారు. మరునాడు జనులు ఉట్లను కొట్టి ఆనందిస్తారు. బృందావనంలో ‘రాధాకృష్ణుల రాసలీలలు కన్నుల పండుగగా జరుగుతుంటాయి! పదహారు వేలమంది గోపికలతో, రాధతో యమున ఒడ్డున బాలకృష్ణుడు ‘రాసలీల’ జరిపి గోపికలను ఆనందపరవశులను చేయడం, ఆత్మ - పరమాత్మల సమ్మేళనలోని అంతరార్థాన్ని తెలియచేసేందుకై ఆయన ఈ బృందావనాన్ని రంగస్థలంగా చేసుకొన్నాడు. 
 
రాసక్రీడను నిమిత్తమాత్రంగా చేసుకుని, గోపికల్లోని శారీరక మోహావేశాన్ని, ఈర్ష్యాసూయల్ని గోపాలుడు నావాడే అన్న స్వార్థాన్ని, అహంకారాన్ని తొలగించి శాశ్వతమైన పరతత్వంలో మమేకం కావడం అంటే ఏమిటో తెలియజేయడమే ఈ రాసలీలల్లోని అంతరార్థం. 
 
యోగమాయ సహకారంతో ప్రతి వొక్క గోపికకి ఒక్కో కృష్ణుని సృష్టించి గోపాలుడు తనకే స్వంతం అనే భావనను కలుగజేసి ఆనందంలో ముంచెత్తడంతో వైష్ణవ భక్తకవులు, జయదేవుడు, సూరదాసు స్వామి హరిదాసు, గోవిందస్వామి మొదలైనవారంతా శ్రీకృష్ణ పరమాత్మ ప్రవచించిన తాత్విక సారాన్ని భక్తజనులకు సరళమైన రీతిలో గీతాల రూపంలో అందించారు. కాళీయమర్దనం, పూతనవధ, దామోదరలీలలు ... ఇలాంటి శ్రీకృష్ణుని లీలలను మనసార స్మరించుతూ కృష్ణాష్టమి నాడు కృష్ణనామాన్ని జపించినవారు శ్రీ కృష్ణ సాయుజ్యాన్ని పొందుతారు.