శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 నవంబరు 2019 (14:24 IST)

ఇక వాహనాలకు ఫాస్టాగ్ ... ఎలా తీసుకోవాలంటే..?

జాతీయ రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాలను దాటుకుని వెళ్లే వాహనాలకు ఇకపై ఖచ్చితంగా ఫాస్టాగ్ ఉండాలని కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. ఈ ఫాస్టాగ్ కలిగిన వాహనాలు టోల్‌ప్లాజాల వద్ద ఆగకుండా నేరుగా వెళ్లిపోవచ్చు. ఈ సౌకర్యం కలిగిన వాహనాల కోసం ప్రత్యేక మార్గాన్ని టోల్‌ప్లాజాల్లో ఏర్పాటుచేశారు. 
 
టోల్‌ప్లాజాల వద్ద రద్దీని తగ్గించడానికి, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి ఫాస్టాగ్ విధానాన్ని అమలు చేయనున్నామని కేంద్రం తెలిపింది. ఇప్పటికే పలు రహదారులపై ఉన్న టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్ కలిగి ఉన్న వాహనాలు వెళ్లేందుకు ఒక లైన్‌ను కేటాయించగా, ఇకపై ఆ లైన్‌లో వెళ్లే వాహనాలు ఖచ్చితంగా ఫాస్టాగ్‌ను కలిగి ఉండాల్సివుంది. లేనిపక్షంలో రెట్టింపు టోల్ చార్జి వసూలు చేస్తామని సదరు మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఫాస్టాగ్‌లను తీసుకోవడం ఇపుడు తప్పనిసరి అయింది. 
 
ఫాస్టాగ్‌ను ఎలా తీసుకోవాలి? 
దేశంలోని 23 బ్యాంకులతోపాటు పలు నేషనల్ హైవే టోల్‌ప్లాజాల వద్ద ఉండే పాయింట్ ఆఫ్ సేల్స్ మెషిన్లు, పలు ఎంపిక చేసిన ఏజెన్సీలు, బ్యాంక్ బ్రాంచీలో ఫాస్టాగ్‌లను అందజేస్తున్నారు. అందుకుగాను వాహనదారులు రూ.200 వన్ టైం జాయినింగ్ ఫీజు చెల్లించి, తమ కేవైసీ పత్రాలతో ఫాస్టాగ్‌కు దరఖాస్తు చేసుకోవాల్సివుంటుంది.
 
అనంతరం కొద్ది రోజుల్లో వాహనదారుల ఇంటికి ఫాస్టాగ్ కోడ్‌తో కూడిన స్టిక్కర్ వస్తుంది. ఆ స్టిక్కర్‌ను వాహనం ముందు అద్దంపై లేదా సైడ్ మిర్రర్‌కు అతికిస్తే.. టోల్‌ప్లాజాలలో ఉండే ఫాస్టాగ్ లేన్ గుండా వెళ్లినప్పుడు ఆ స్టిక్కర్‌ను టోల్ సిబ్బంది ఆటోమేటిగ్గా స్కాన్ చేసుకుంటారు. దీంతో ఆ స్టిక్కర్‌పైన ఉన్న ఫాస్టాగ్ కోడ్‌కు లింక్ అయి ఉన్న వాలెట్‌లోని మొత్తం నుంచి టోల్ చార్జి ఆటోమేటిగ్గా డిడెక్ట్ అవుతుంది. 
 
ఈ క్రమంలో వాహనదారులు టోల్ లైన్‌లో వాహనాన్ని ఆపాల్సిన పని ఉండదు. దీంతో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. అయితే సదరు వాలెట్‌లో ఉన్న మొత్తం టోల్ చార్జిల కింద కట్ అయితే వాలెట్‌ను మళ్లీ నిర్దిష్టమైన మొత్తంతో టాపప్ చేయించుకోవాల్సి ఉంటుంది.