శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By
Last Modified: సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (16:36 IST)

అలాంటి యూజర్ వుంటే ఎంత... పోతే ఎంత? ఎయిర్ టెల్ - వొడాఫోన్ - ఐడియా

రిలయన్స్ జియో వచ్చాక యూజర్ మైండ్ మారిపోయింది. ఎందుకంటే అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ సౌకర్యం కల్పించడంతో ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా తదితర టెలికం సంస్థలు భారీ నష్టాలు చవిచూశాయి. జియో ఇచ్చిన షాక్ దెబ్బకు ఎన్ని ప్లాన్లు వేసినా వర్కవుట్ కాలేదు. చివరికి మెల్లిగా టారిఫ్ ప్లాన్లు తగ్గించుకోవాల్సి వచ్చింది. పోటీ ప్రపంచంలో ఇది మామూలే. 
 
ఐతే చాలామంది యూజర్లు సిమ్ కార్డులు మాత్రమే పెట్టుకుని ఇన్ కమింగ్ కాల్స్ కు మాత్రమే ఎయిర్ టెల్, వొడాఫోన్ తదితర సంస్థలను వాడుకుంటున్నట్లు కనిపెట్టాయి. ఇదివరకు అన్ లిమిటెడ్ ప్యాక్ వేస్తే తప్పనిసరిగా మాట్లాడుతూ వుండేవారు కాబట్టి ఆ బ్యాలెన్స్ ఖర్చయిపోయేది. కానీ ఇప్పుడలా కాదు... ఏదో రూ. 30 బ్యాలెన్స్ వేసి దానితో 6 నెలలకు పైగా ఇన్‌కమింగ్ కాల్స్ మాట్లాడుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారు. దీనితో ఆయా టెలికం కంపెనీల ఆదాయం దారుణంగా పడిపోయి పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోతున్నాయి.
 
యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ పైన మొబైల్ నెట్వర్క్ సంస్థల ఆదాయం ఆధారపడి వుంటుంది. అంటే... యూజర్ మాట్లాడుతూ బ్యాలెన్స్ ఖర్చు చేస్తేనే ఆదాయం. అలా కాకపోతే ఇబ్బందులే. జియో ఫోన్ వచ్చిన తర్వాత ఈ పరిస్థితి పూర్తిగా మారియింది. చాలామంది జియో ఫోన్‌ను మాట్లాడేందుకు మిగిలిన నెట్వర్క్ ఫోన్లను కేవలం రిసీవ్ కోసమే పెట్టుకున్నట్లు తేలడంతో ఎయిర్ టెల్, వొడాఫోన్ తమ నిబంధనలను కఠితరం చేశాయి.

చెప్పాలంటే ఈ నిబంధన జియోలోనూ వుంది. రీచార్జ్ చేస్తేనే ఇన్ కమింగ్ అండ్ ఔట్ గోయింగ్. కాబట్టి.. ఇదే పద్ధతిని ఇప్పుడు ఎయిర్ టెల్, వొడాఫోన్ ఫాలో అవుతున్నాయి. దీనితో ఇప్పుడు యూజర్లు కూడా తప్పనిసరిగా రీచార్జ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మొత్తమ్మీద జియోతో నష్టాలు చవిచూసిన ఇతర నెట్వర్కులు ఇప్పుడు క్రమేణా తమ నష్టాలను భర్తీ చేసుకుంటున్నట్లు ట్రేడ్ ఎనలిస్టులు చెపుతున్నారు.