శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : శనివారం, 13 జూన్ 2015 (06:58 IST)

అపచారం...! అపచారం..!! వెంకన్న నామానికే వక్రగీతలు.. కైంకర్యాల నుంచి దీక్షితులు తొలగింపు

కొన్ని వేల మంది భక్తులను ఆకట్టుకుంటున్న తిరుమల వెంకన్న ఆహార్యం ప్రత్యేకం. ఆ ముఖవర్చస్సు తిరుగులేనిది. వెంకన్న నామం మరువలేనిది. అలాంటి నామాన్ని వక్రంగా గీస్తే.. ఇంకేముందు వెంకన్న భక్తుల మనోభావాలు దెబ్బతినవు. అయితే శుక్రవారం తెల్లవారుజామున అదే జరిగింది. నామాన్ని తీర్చిదిద్దడంలో తేడా చేశారని ఓ దీక్షితులును కైంకర్యాల నుంచి తొలగించినట్లు సమాచారం. 
 
ప్రతి శుక్రవారం వేకువజామున ఆలయ సన్నిధిలోని మూలవర్లకు అభిషేకం జరుగుతుంది. అభిషేకం పూర్తయ్యాక నామం, కిరీటం, కర్ణాభరణం, భుజకీర్తులు, తదితర ఆభరణాలతో స్వామివారివిగ్రహాన్ని అలంకరిస్తారు. ఇందులో భాగంగా అభిషేకం జరిగాక విధుల్లో ఉన్న సంబంధిత దీక్షితులు మూలవర్లకు తెల్లటినామం దిద్దారు. 
 
దానిని నిశితంగా పరిశీలించిన అర్చకులు కూడా స్వామివారికి నామం అసంపూర్ణంగా ఉందని నిర్ధారించారు. ఈ క్రమంలో శుక్రవారం నామం ఏర్పాటు చేసిన దీక్షితులను ఇకపై అభిషేక కైంకర్యాలు నిర్వహించకూడదని ప్రాథమికంగా ఆదేశాల జారీచేసినట్లు సమాచారం. పరధ్యానంలో పని చేస్తే ఇలాంటి తప్పిదాలే దొర్లుతుంటాయనీ, మరోమారు తప్పిదం జరుగకుండా ఉండడానికి ఆయనపై చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది.