మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By
Last Updated : శనివారం, 2 మార్చి 2019 (15:40 IST)

భోజన సమయంలో పిల్లలను తిడుతున్నారా...?

కొంతమంది ఆవేశాన్ని అణచుకోలేక అన్నం కంచాన్ని విసిరికొడుతూ వుంటారు. జీవితంలో ఎవరైతే అన్నాన్ని నిర్లక్ష్యం చేస్తారో.. కోపంతో విసిరి కొడతారో అది వారికి దూరమవుతుందని ఆధ్యాత్మిక నిపుణులు చెప్తున్నారు.
 
పిల్లలైనా.. యువకులైనా తెలిసో తెలియకో ఏదైనా పొరపాటు చేస్తే.. వాళ్లు భోజనం చేసే సమయంలో తల్లిదండ్రులు మందలించడం జరుగుతుంటుంది. ఆ మాటలను భరిస్తూనే బాధపడుతూనే వాళ్లు భోజనం చేస్తారు. ఇలా ఆవేదనని అణచుకుంటూ చేసిన భోజనం వంటబట్టకపోగా అనేక అనారోగ్య సమస్యలను కొనితెస్తుందని పండితులు సూచిస్తున్నారు. 
 
ఎలాంటి పర్వదినం కాకుండా అలా అందరూ కోపంతో కటిక ఉపవాసం చేయడం కూడా దోషమేనని పెద్దలు చెబుతుంటారు. భోజనం చేస్తున్న వారిపై ఆవేశ పడడం వలన శాస్త్ర సంబంధమైన దోషాలతో పాటు, అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతూ వుంటాయి. అందువలన భోజన సమయంలో సాధ్యమైనంత వరకూ కోపతాపాలకు పోకుండా ఉండడమే అన్నివిధాలా మంచిదని చెప్పవచ్చు.
 
భోజనం అనేది పవిత్రమైన ప్రదేశంలో కూర్చుని ప్రశాంతంగా చేసినప్పుడే వంటబడుతుంది. అందుకే హడావిడిపడకుండా ... మాట్లాడకుండా భోజనం చేయాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.