శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : బుధవారం, 16 సెప్టెంబరు 2015 (14:27 IST)

శ్రీవారి తొలిదర్శనం ఎవరికీ...? వారికే ఎందుకు..?

తిరుమలలో శ్రీవారి దర్శనమంటే ఎవరికైనా చాలా ఆసక్తి ఉంటుంది. మరి తొలి దర్శనం చేసుకునే భాగ్యం ఎవరికి కలుగుతుంది. అది ఒకటి, రెండు సార్లు కాదు. జీవితాంతం వారే తొలిదర్శనం చేసుకుంటారు. వారే ఎందుకు తొలి దర్శనం చేసుకుంటారు. ఎవరు వారు ఆ చరిత్ర ఏమిటి?
 
సూర్యోత్పూర్వానికి ముందే పూజారులు శుభ్రంగా నదీస్నానం చేసి ఆలయ తలుపులు తెరిచి  స్వామివారికి నమస్కరించి ఆలయాన్ని తెరుస్తారు. అంటే పూజారులే తొలి దర్శనం చేసుకుంటారు. ఇది సాధారణ ఆలయాల్లో... మరి తిరుమలలో ఏం జరుగుతుంది. వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఎలా ఉంటుంది. శ్రీవారి ఆలయానికి పెద్ద వ్యవస్థ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానమే ఉంది. అయితే ఎవరు తలుపులు తెరుస్తారు.? తొలిదర్శనం ఎవరు చేసుకుంటారు. ప్రతీ రోజూ ఒకే ఒకాయన తలుపు తెరుస్తారు. ఆయనే తొలిదర్శనం చేసుకుంటారు. ఎవరాయన అంటే సన్నిధి గొల్ల వారే తొలి దర్శనం చేసుకుంటారు. ఎందుకలా..? అంటే మనం చరిత్రలోకి తొంగి చూడాల్సిందే.
 
ఎప్పటి నుంచో స్వామి వారికి ఓ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ప్రకారం స్వామి పరకామణిని కొందరు చూస్తే.. ఆలయాన్ని కొందరు చూసేవారు. పూజాధి కార్యక్రమాలు అర్చకులు చేస్తారు. ఇందులో భాగంగా స్వామి వారి ఆలయ భద్రత వంటి వాటిని గొల్లలు చూసేవారు. ఉదయం ఆలయం తెరచి రాత్రి మళ్ళీ మూసుకుని వెళ్ళేవారు. తిరిగి వారే ఆలయాన్ని తెరుస్తారు. ఆ బాధ్యతను నేటికి వారే నిర్వహిస్తున్నారు. అందుకే వీరిని సన్నిధి గొల్ల అంటారు. సాంప్రదాయబద్ధంగా ఆ కుటుంబమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆనవాయితీగా ప్రతిరోజు తెల్లవారుజామున సన్నిధి గొల్ల శుచిగా స్నానం చేసి దివిటీ చేపట్టుకుని 3 గంటల సమయంలో కుంచెకోల(తాళాలు ఉండేది) తీసుకుని ఆలయానికి బయలుదేరుతారు. అంతకు మునుపు అర్చకులు ఆయన ఇంటి వెళ్ళి ఆయనను ఆలయం తెరవడానికి ఆహ్వానిస్తారు.
 
అందరు కలసి ఆలయం వద్దకు వెళ్ళతారు. అందరూ బయట నిలబడి ఉండగా గొల్లసన్నిధి తాళాలతో తలుపులు తెరుస్తారు. అనంతరం బంగారు వాకిలి వద్దకు వెళ్ళి జీయంగార్ స్వాములు వేదపండితులు సుప్రభాతం పఠనం మొదలు పెడుతుండగా సన్నిధి గొల్ల ఆ తలుపులు తెరుస్తారు. దీంతో ఆయనకు వేంకటేశ్వర స్వామి తొలిదర్శనం లభిస్తుంది. ఆ తరువాత అర్చకులు తమతో తెచ్చుకున్న పూజా సామాగ్రితో లోనికి ప్రవేశించి రాత్రి పవళింప చేసిన భోగశ్రీనివాస మూర్తి విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకెళ్ళతారు. తరువాత అన్ని రకాల కైంకర్యాలు జరుగుతాయి. ఇలా తొలిదర్శనం సన్నిధి గొల్లకు దక్కుతుంది. తిరిగి రాత్రి తుది దర్శనాన్ని చేసుకుని తలుపులు వేసి సన్నిధి గొల్ల తాళాలను తను నివాసం ఉంటున్న ఇంటికి తీసుకెళ్ళతారు.