1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 18 ఫిబ్రవరి 2021 (09:39 IST)

అమెరికాను వణికిస్తున్న మంచుతుఫాను : 20 మంది మృతి

అగ్రరాజ్యం అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. ఈ తుఫాను కారణంగా ఇప్పటికే 20 మందికి వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ మంచు తుఫాను ధాటికి టెక్సాస్, ఓక్లహామా, టెన్నెసీ, ఇల్లినాయస్ రాష్ట్రాలు చిగురుటాకులా వణుకుతున్నాయి.
 
ముఖ్యంగా, టెక్సాస్‌లో పరిస్థితి మరింత భయానకరంగా ఉంది. విపరీతంగా కురుస్తున్న హిమపాతం కారణంగా ఈ నెల 14 నుంచి ఇప్పటివరకు 20 మంది వరకు ప్రాణాలు కోల్పోయి ఉంటారని అధికారులు చెబుతున్నారు. 
 
మరోవైపు, కరెంటు కోతలు ప్రజలను మరిన్ని ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. విద్యుత్ కోతల ప్రభావం దాదాపు 40 లక్షల ఇళ్లు, దుకాణాలపై పడింది. రహదారులపై దట్టంగా మంచు పేరుకుపోవడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. 
 
హిమపాతం కారణంగా విద్యుత్ వినియోగం ఎక్కువ కావడంతో డిమాండ్‌కు సరిపడా సరఫరా చేయలేక అధికారులు చేతులెత్తేశారు. విద్యుత్ వ్యవస్థ కుప్పకూలకుండా ఉండాలంటే కరెంటు సరఫరాను నిలిపివేయడమే మంచిదని అధికారులు చెబుతున్నారు.
 
కరెంటు కోతల కారణంగా ఆసుపత్రుల సేవలకు అంతరాయం కలుగుతుండడంతో ప్రత్యామ్నాయాల కోసం అన్వేషిస్తున్నారు. మరోవైపు, టెక్సాస్‌లో ఆరు లక్షల ఇళ్లు, వాణిజ్య, వ్యాపార సంస్థలకు విద్యుత్‌ను పునరుద్ధరించినట్టు అధికారులు తెలిపారు. టెక్సాస్‌లో గత వారం రోజుల్లో 130 కార్లు ప్రమాదానికి గురికాగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.