శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 3 నవంబరు 2020 (08:57 IST)

పెట్రేగిన ఉగ్రవాదులు... యూనివర్శిటీలో ఊచకోత.. ఎక్కడ?

ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదులు పెట్టేగిపోయారు. ఆ దేశంలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయంలో రక్తపుటేరులు పారించారు. ఏకంగా 22 మందిని ఊచకోత కోశారు. వీరిలో అనేకమంది విద్యార్థులే ఉండటం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కాబూల్ యూనివర్సిటీలో సోమవారం పుస్తక ప్రదర్శన నిర్వహించారు. ఇందులో ఆఫ్గనిస్థాన్‌లోని ఇరాన్ రాయబారి బహదూర్ అమినియన్, సాంస్కృతిక దౌత్యవేత్త మొజ్తాబా నొరూజితోపాటు పలువురు ప్రముఖులు హాజరు కాబోతున్న సమాచారం తెలుసుకున్న ఉగ్రవాదులు చెలరేగిపోయారు. 
 
అత్యాధునిక తుపాకులతో యూనివర్సిటీలోకి ప్రవేశించిన ముగ్గురు ఉగ్రవాదులు విద్యార్థులపైకి తూటాల వర్షం కురిపించారు. ఏం జరుగుతుందో తెలిసేలోపే 22 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఉగ్రవాదుల నుంచి తమ ప్రాణాలు కాపాడుకునేందుకు విద్యార్థులు ప్రాణభయంతో పరుగులు తీశారు.
 
ఈ సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా దళాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. ఇరు వర్గాల మధ్య దాదాపు 5 గంటలపాటు కాల్పులు కొనసాగాయి. దీంతో తుపాకులు, గ్రనేడ్ల మోతతో యూనివర్సిటీ దద్దరిల్లిపోయింది. 
 
భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాదులు ముగ్గురూ హతమయ్యారు. యూనివర్సిటీలో ఉగ్రఘటనను భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రంగా ఖండించారు. దీనిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఉగ్రవాదంపై పోరులో ఆఫ్గనిస్థాన్‌కు భారత సాయం కొనసాగుతుందని హామీ ఇచ్చారు.