1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By కుమార్
Last Updated : బుధవారం, 20 మార్చి 2019 (15:20 IST)

భారీ విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న ఒకే ఒక్కడు

మార్చి 10వ తేదీన ప్రమాదానికి గురైన ఇథియోపియా విమానంలో ప్రయాణించే 157 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఒక వ్యక్తి మాత్రం అనూహ్యంగా ఈ ప్రమాదం నుండి తప్పించుకోగలిగాడు. గ్రీస్‌కు చెందిన ఆంటోనీ మావ్రోపోలస్ ఇంటర్నేషనల్ సాలిడ్ వేస్ట్ అసోసియేషన్ అనే స్వచ్ఛంద సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నాడు. నైరోబీలో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి పర్యావరణ సదస్సుకు వెళ్లేందుకు ఆయన అదే విమానంలో టికెట్ బుక్ చేసుకున్నాడు. 
 
అయితే అనివార్య కారణాల వల్ల ఎయిర్‌పోర్ట్‌కు రెండు నిమిషాలు ఆలస్యంగా రావడంతో ఆయన ఎక్కాల్సిన బోయింగ్ 737-8 విమానం టేకాఫ్ అయిపోయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆ విమానం కుప్పకూలిపోయింది. ఈ విషయం తెలియని ఆంటోనీ తనను ఎలాగైనా విమానం ఎక్కడానికి అనుమతించాలని అక్కడి సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. 
 
ఎంత చెప్పినా వినకపోవడంతో అతడిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ సిబ్బంది ఆయనతో మీరు ఇప్పుడు చేయాల్సింది గొడవ పెట్టుకోవడం కాదు, దేవుడికి కృతజ్ఞతలు తెలపడం అని చెప్పడంతో అతను ఆశ్చర్యపోయాడు. మీరు ఎక్కాల్సిన విమానం కూలిపోయింది, అందులో ఎక్కాల్సిన ప్రయాణీకుల్లో మీరు మాత్రమే మిగిలిపోయారు. 
 
కాబట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేయండి అనడంతో నమ్మలేకపోయానంటూ అతని అనుభవాన్ని పంచుకున్నాడు. ఆ వార్త విని చాలా దిగ్ర్భాంతికి గురయ్యానని.. తాను చాలా అదృష్టవంతుడినని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసారు.