శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2019 (20:01 IST)

శ్రీలంకలో ఎమర్జెన్సీ : 290కి చేరిన మృతులు

శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించారు. సోమవారం అర్థరాత్రి ఇది అమల్లోకి వచ్చింది. ఆ దేశ రాజధాని కొలంబోలో ఆదివారం వరుస బాంబు పేలుళ్లు చోటుచేసుకున్నాయి. సోమవారం కూడా మరో బాంబు పేలుడు సంభవించింది. భద్రతా బలగాలు గుర్తించిన బాంబును నిర్వీర్యం చేస్తుండగా, ఈ బాంబు పేలింది. కొలంబో బస్టాండుకు సమీపంలో మరో 87 డిటోనేటర్లను గుర్తించారు. 
 
ఈ పరిణామాలన్నింటినీ బేరీజు వేసిన శ్రీలంక ప్రభుత్వం అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ప్రకటించనుంది. ఇది సోమవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది (వచ్చింది). ఈ మేరకు అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సర్కారు నిర్ణయం తీసుకున్నారు. 
 
కాగా, ఆదివారం ఈస్టర్ సందర్భంగా శ్రీలంకలోని చర్చిల్లో జరిగిన బాంబు పేలుళ్ల తర్వాత ప్రభుత్వం ఈ చర్య చేపడుతోంది. ఈ వరుస పేలుళ్లలో ఇప్పటివరకు 290 మంది చనిపోయారు. మరో 500 మందికి పైగా గాయపడ్డారు. ఈ పేలుళ్లలో 6 భారతీయ పౌరులు సహా 35 మంది విదేశీయులు ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో భారత కోస్ట్ గార్డ్ శ్రీలంక సరిహద్దుల్లో గస్తీని పెంచింది. శ్రీలంక నుంచి తప్పించుకొన్న ఆత్మాహుతి ఉగ్రవాదులు రావచ్చనే అనుమానాలతో భారత తీర రక్షక దళం ఈ చర్య తీసుకొంది. సిన్నామ గ్రాండ్ హోటల్ రెస్టారెంట్‌లో ఒక ఆత్మాహుతి దాడి చేసిన ఉగ్రవాది తనను తాను పేల్చుకొన్నట్టు సమాచారం. 
 
పేలుళ్లు జరపడానికి ఒక రాత్రి ముందే అతను హోటల్‌లోని ఒక గదిలో బస చేసిశాడు. పేలుడు జరిపిన ఉదయం అల్పాహారం స్వీకరించేందుకు అందరి కంటే ముందు లైన్‌లో నిలబడి ఈ మారణహోమానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు. ఈ వరుస పేలుళ్లకు బాధ్యతను ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటివరకు ప్రకటించలేదు. 
 
ఇదిలావుంటే చర్చిలు, హోటళ్లలో వరుసగా జరిగిన బాంబు పేలుళ్ల కేసులో శ్రీలంక పోలీసులు ఇప్పటి వరకు 24 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారి సమాచారాన్ని బహిర్గత పరచలేదు. వీరిలో 13 మందిని కొలంబో, చుట్టుపక్కల రెండు ప్రదేశాల నుంచి అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. దశాబ్దం క్రితం ఎల్టీటీఈ అంతంతో పాటు ముగిసిందనుకున్న రక్తపాత పోరాటం తర్వాత ఈ వరుస పేలుళ్లు మరోసారి శ్రీలంకలో శాంతిని భంగం చేశాయి.