బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వాసు
Last Updated : గురువారం, 14 మార్చి 2019 (17:34 IST)

మరి మసూద్‌ని అప్పజెప్పొచ్చుగా... సుష్మా ప్రశ్న

పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌, ఆ దేశ ప్రభుత్వంపై భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాక్‌ ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోనంతవరకు ఆ దేశంతో ఎలాంటి చర్చలు జరపబోమని  స్పష్టం చేసిన సుష్మా... పాక్‌ ప్రధాని నిజంగా గొప్ప ఔదార్యం కలిగిన వారే అయితే మసూద్‌ అజార్‌ను భారత్‌కు అప్పగించాలని కోరారు.
 
ఢిల్లీలో బుధవారం జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న సుష్మాస్వరాజ్‌‌ను... భారత్‌ జరిపిన వైమానిక దాడుల గురించి ప్రశ్నించగా, ఆవిడ సమాధానమిస్తూ...‘జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థలను లక్ష్యంగా చేసుకుని భారత్‌ దాడులు జరిపింది. కానీ పాక్‌ మిలిటరీ మాత్రం జైషే తరఫున మన దేశంపై దాడికి యత్నించింది. ఆ దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. ఉగ్ర సంస్థలకు ఆర్థికంగా సాయం చేస్తోందన్నారు. 
 
తీవ్రవాద రహిత వాతావరణం మధ్యే మేం పాక్‌తో చర్చలు జరుపుతాము. చర్చలు, ఉగ్రవాదం కలిసి ముందుకెళ్లవు’ అంటూ దాయాది దేశంపై తీవ్రంగా మండిపడ్డారు. పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ రాజనీతిజ్ఞుడు అని కొంతమంది చెబుతున్నారనీ, ఆయనకు అంత శక్తే ఉంటే జైషే అధినేత మసూద్‌ను భారత్‌కు అప్పగించాలని సుష్మా అన్నారు. అప్పుడే ఆయన ఔదార్యం ఎంత గొప్పదో తెలుస్తుందని ఎద్దేవా చేసారు.